సుప్రీంకు చేరిన తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ.. సీజేఐ రమణ కీలక సూచన
ABN , First Publish Date - 2021-08-02T17:58:31+05:30 IST
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల జగడానికి ఇంకా ఫుల్స్టాప్ పడలేదు. ఈ పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది...
న్యూ ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల జగడానికి ఇంకా ఫుల్స్టాప్ పడలేదు. ఈ పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది. సోమవారం నాడు కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుమారు గంటపాటు ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన అనంతరం ఎల్లుండికి దేశ అత్యున్న న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ కీలక సూచన చేశారు. మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సీజేఐ సూచించారు. రెండు రాష్ట్రాలతో సంప్రదించి పిటిషన్పై నిర్ణయం తీసుకోవాలని ఇరు రాష్ట్రాల సీనియర్ న్యాయవాదులకు సీజేఐ ఎన్వీ రమణ సూచించారు.
నేను రెండు రాష్ట్రాల చెందిన వాడినే..
‘తెలుగు ప్రజల మధ్య ఘర్షణలు అనవసరం. నీళ్ల సమస్యలు పెద్దవి కాకుండా చూసుకోవాలి. పరిస్థితులు చేయి దాటకుండా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలి. మూడో వ్యక్తి జోక్యం అవాంఛనీయం. నేను కూడా రెండు రాష్ట్రాలకు చెందిన వాడినే. గతంలో నీళ్ల కేసులు కూడా వాదించాను. ఏపీ దాఖలు చేసిన కేసులో న్యాయపరమైన అంశాలపై నేను మాట్లాడను. న్యాయపరంగానే పరిష్కరించాలనుకుంటే ఈ కేసు విచారణను వేరే బెంచ్కు మారుస్తాను’ అని రమణ చెప్పుకొచ్చారు.
వాదనలు ఇలా..!
అయితే.. ఏపీ పిటిషన్పై విచారణ అవసరం లేదని తెలంగాణ తరపు న్యాయవాది సుప్రీంకు వివరించారు. అంతేకాదు.. ఇప్పటికే కేంద్రం గెజిట్ జారీచేసిందన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. అయితే.. అక్టోబర్ నుంచి గెజిట్ అమలులోకి వస్తుందని ఏపీ తరపు న్యాయవాది సుప్రీంకు తెలియజేశారు. ఇప్పట్నుంచే గెజిట్ అమలు చేయాలని కోరుతున్నామని ఏపీ తరపు న్యాయవాది సుప్రీంకు తెలిపారు. 4 నెలలపాటు నీటిని నష్టపోకూడదనే అడుగుతున్నామని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న సీజేఐ.. కేంద్రం నుంచి ఇంకా ఏమైనా సూచనలు కావాలంటే వాయిదా వేస్తానని సీజేఐ తెలిపారు. రాజకీయ ప్రాధాన్యత ఉన్న కేసు కాబట్టి ఏపీ ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలుసుకుంటానని సీనియర్ కౌన్సిల్ దుశ్యంత్ దవే వ్యాఖ్యానించారు. అనంతరం కేసు విచారణను బుధవారానికి ధర్మాసనం వాయిదా వేసింది.