అహంభావంతో చెలాయించే అధికారం ఎక్కువ కాలం ఉండదు: భట్టి
ABN , First Publish Date - 2021-04-17T06:05:48+05:30 IST
అహంభావంతో చెలాయించే అధికారం ఎక్కువ కాలం ఉండదు: భట్టి
చైతన్యవంతమైన ఖమ్మం ఓటర్లు అమ్ముడుపోరు
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
ఖమ్మం సంక్షేమ విభాగం, ఏప్రిల్ 16: అహంభావంతో చేసే రాజకీయాలు, చెలాయించే అధికారం ఎక్కువకాలం ఉండదని, చైతన్యవంతమైన ఖమ్మం ప్రజలు డబ్బులకు అమ్ముడుపోరని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఖమ్మంలోని 50వ డివిజన్లో జరిగిన కార్యక్రమంలో పలు పార్టీలకు చెందిన 400కుటుంబాల వారు భట్టి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం కార్పొ రేషన్ ఎన్నికల్లో అభివృద్ధి చెప్పుకొని.. గెలుస్తామన్న నమ్మకం లేక.. టీఆర్ఎస్ వారు డబ్బులు పంచి ఓటర్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. పోలీసులు, అధికారులు ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకుంటు న్నారని పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని కోరారు. గత టీఆర్ఎస్ కార్పొరేటర్లు స్థలాలు కబ్జా చేసి డబ్బులు సంపాదించుకున్నారని, ప్రతీ ఐదేళ్లకి వచ్చే ఎన్నికలు ప్రజాతీర్పుగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ కార్పొరేటర్లు నాగండ్ల దీపక్చౌదరి, వడ్డెబోయిన నర్సింహారావు, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ జావీద్ తదితరులతో పాటు 50వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి లింగం నరేందర్ పాల్గొన్నారు.