కాళేశ్వరంపై శ్వేతపత్రం విడుదల చేయాలి
ABN , First Publish Date - 2021-01-21T06:47:36+05:30 IST
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నీటి ఎత్తిపోతలు, విద్యుత్తు ఖర్చు తదితర వివరాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. దోపిడీ కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ
దోపిడీ కోసమే అంచనాల పెంపు: భట్టి
కొత్తగూడెం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నీటి ఎత్తిపోతలు, విద్యుత్తు ఖర్చు తదితర వివరాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. దోపిడీ కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు అంచనాలను పెంచిందని, ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ శాసనసభకు డీపీఆర్ అందించలేదని అన్నారు. బుధవారం కొత్తగూడెంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కొన్నినెలలుగా ఫామ్ హౌస్కే పరిమితమైన సీఎం కేసీఆర్ అర్ధరాత్రి ఉలిక్కిపడి లేచి కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలన చేస్తున్నారని విమర్శించారు. రూ.28వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు రీడిజైనింగ్ పేరుతో రూ.80వేల కోట్లకు పెంచి వాటిలోనూ రూ.వేల కోట్లను దోపిడీ చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, సీఎం కేసీఆర్ అరెస్ట్ కావడం ఖాయమంటూ బీజేపీ నాయకులు ప్రగల్బాలు పలకడమే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని ఆయన మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ది కాకి గోల తప్ప మరేమీ ఉండదని విమర్శించారు.