త్వరలో ప్రొద్దుటూరుకు సీఎం రాక
ABN , First Publish Date - 2021-12-08T04:59:38+05:30 IST
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈనెలలో జిల్లా పర్యటన ఉన్నందున ప్రొద్దుటూరుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ప్రొద్దుటూరు, డిసెంబరు 7 : ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈనెలలో జిల్లా పర్యటన ఉన్నందున ప్రొద్దుటూరుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ సాయికాంత్వర్మ మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఆర్టీవో కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేయనున్న హెలిపాడ్ స్థలాన్ని ఆయన పరిశీలించారు. బహిరంగసభ ఏర్పాటు కోసం శివాలయం సర్కిల్, అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ మైదానం, యోగివేమన ఇంజనీరింగ్ కళాశాలల్లోని స్థలాలను పరిశీలించారు. అనంతరం ఎద్దుల వెంకటసుబ్బమ్మ హైస్కూల్లో మనబడి, నాడు-నేడు కార్యక్రమ పనులను పరిశీలించారు. గోరుముద్దలో భాగంగా విద్యార్థినులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. పాఠశాల పనుల పట్ల సంతృప్తి చెందుతూ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాశాఖ అధికారిని ప్రశంసించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారురెడ్డి, కమిషనర్ వెంకటరమణయ్య, అసిస్టెంట్ కమిషనర్ గంగాప్రసాద్, ఎంపిడీవోలు సుబ్రమణ్యం, సయ్యద్వున్నీసా, ఎంఈవో సావిత్రమ్మ, ఇంజనీరింగ్ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.