మున్సిపాలిటీల ఆదాయం ముట్టుకోం: సీఎం
ABN , First Publish Date - 2020-10-16T08:57:01+05:30 IST
నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు వచ్చే ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ముట్టుకోబోదని సీఎం జగన్ స్పష్టం చేశారు.
అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు వచ్చే ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ముట్టుకోబోదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆ డబ్బును ఆయా సంస్థలు వెచ్చిస్తాయన్నారు. కల్పిస్తూ మున్సిపాలిటీ ఉద్యోగుల జీతభత్యాలను 010పద్దు కింద రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు.
నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో సంస్కరణలపై ఆయన గురువారం సమీక్షించారు. యూఎల్బీల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, మురుగునీటి పారుదల కోసమయ్యే నిర్వహణ వ్యయాన్ని మాత్రమే ప్రజలనుంచి వసూలు చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఆదాయ, వ్యయాల వివరాలు, వేతనాలు-అభివృద్ధి కార్యక్రమాలకు ఎంత వెచ్చిస్తున్నారు, ఇంకా ఏమేం చర్యలు తీసుకుంటే మెరుగైన వసతులు అందించగలుగుతామనే వివరాలతో సవివర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలన్నారు.