సెంచురీ పరిశ్రమతో ఉద్యోగ అవకాశాలు: జగన్

ABN , First Publish Date - 2021-12-23T21:50:02+05:30 IST

జిల్లాలో ఏర్పాటు చేస్తున్న సెంచురీ పరిశ్రమతో యువతీ

సెంచురీ పరిశ్రమతో ఉద్యోగ అవకాశాలు: జగన్

కడప: జిల్లాలో ఏర్పాటు చేస్తున్న సెంచురీ పరిశ్రమతో యువతీ,యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం జగన్ అన్నారు. తన సొంత జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. బద్వేలు నియోజకవర్గం గోపవరంలో జగన్ పర్యటించారు. రూ.956 కోట్ల పెట్టుబడితో సెంచురీ ఫ్లై పరిశ్రమకు సీఎం గురువారం శంకుస్థాపన చేశారు. బద్వేలు రెవెన్యూ డివిజనల్ కార్యాలయ నిర్మాణానికి కూడా సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ బద్వేల్ ప్రాంతంలో సెంచరీ ప్లై సంస్థ రావడం చాలా సంతోషమన్నారు. కలప మీద ఆధారపడ్డ కంపెనీ కాబట్టి కడప జిల్లాతో పాటు పక్క జిల్లాల రైతులకు మంచి జరుగుతుందన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. ఇక్కడి రైతులకు ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం 2 ఎకరాల చొప్పున 200 ఎకరాల వ్యవసాయ భూమిని ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కంపెనీకి రాష్ర్ట ప్రభత్వం అన్నిరకాల సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు.


6 కోట్ల రూపాయలతో ఆర్డీఓ కార్యాలయం నిర్మిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాబోవు రోజుల్లో బద్వేల్‌లో బాగా అభివృద్ధి జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే 500 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులతో బద్వేల్ నియోజక వర్గం ముందుకు వెళ్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమాల్లో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-23T21:50:02+05:30 IST