కరోనాపై పోరుకు మేము సైతం...
ABN , First Publish Date - 2020-04-09T09:35:54+05:30 IST
కరోనాపై పోరుకు మేము సైతం...
ముందుకొచ్చిన న్యాయమూర్తులు, కోర్టుల సిబ్బంది
అమరావతి, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): కరోనా నియంత్రణ చర్యల కోసం హైకోర్టు నుంచి వివిధ స్థాయుల న్యాయస్థానాల్లోని న్యాయమూర్తులు, ఇతర సిబ్బంది విరాళం ఇవ్వాలని నిర్ణయించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ఫుల్ కోర్టు ఏప్రిల్ 6న వీడియో కాన్ఫరెన్స్లో కరోనా విపత్తుపై చర్చించింది. ఈ సందర్భంగా తమ వంతు సాయంగా కొంత విరాళం ఇవ్వాలని మెజారిటీ న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా విరాళాలను ‘ప్రైమ్ మినిస్టర్ సిటిజెన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్ (పీఎం కేర్స్) ఫండ్కు చెల్లించాలని నిర్ణయించారు. రిజిస్ట్రీలతోనూ సంప్రదించిన మీదట కోర్టుల్లోని ఏఏ ఉద్యోగులు ఎంతెంత ఇవ్వాలన్నది నిర్ణయించారు. విరాళం ఇవ్వడంపై ఎవరికైనా అభ్యంతరముంటే ఈ నెల 13 లోపు రిజిస్ట్రార్ (పరిపాలన)కు తెలియజేయవచ్చు. ఉద్యోగుల విరాళానికి పన్ను మినహాయింపు ఉంటుందని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పేర్కొన్నారు.
రాంకీ ఎన్విరో విరాళం రూ.5 కోట్లు
రాంకీ ఎన్విరో ఇంజినీర్స్ (ఆర్ఈఈఎల్) ఏపీ సీఎం సహాయ నిధికి రూ.5 కోట్లు సాయం చేసింది. ఇందులో రూ.2 కోట్లు విలువైన వ్యక్తిగత రక్షణ ఎక్వి్పమెంట్ (పీపీఈ) ఉంది. జీఎంఆర్ సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయాల విరాళాన్ని అందించింది. బుధవారం సంస్థ ప్రతినిధి జీ శ్రీనివాస్ విజయవాడలో సీఎస్ నీలం సాహ్నిని కలిసి రూ.కోటిని ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేసిన లేఖను అందజేశారు. నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ, ఆర్వీఆర్జేసీ తరఫున సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ రూ.28 లక్షలు విరాళం ప్రకటించారు.