సీఎం జగన్ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది: అనిత
ABN , First Publish Date - 2020-06-04T22:59:31+05:30 IST
సీఎం జగన్ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది: అనిత
అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శలు గుప్పించారు. ఏడాది పాలనలో ఏం సాధించారని వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు? అని అనిత ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ఆమె మండిపడ్డారు. బాలికలు, మహిళలపై వాలంటీర్లు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, వాలంటీర్ల అరాచకాలకు జనం భయపడిపోతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్ కంటే ముందుగా జగనన్న వస్తాడని ఆటో పంచ్ లు వేసిన వారంతా ఎక్కడున్నారని, ప్రతి దానికీ గొంతు చించుకునే మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఏమయ్యారు? అని ఆమె మండిపడ్డారు. ఏపీలో మహిళా హోంమంత్రి ఉండి కూడా ఆడకూతుళ్లకు భద్రత లేదని, మహిళలను సొంత చెల్లెళ్లలా చూసుకోవడమంటే ఇదేనా.. ముఖ్యమంత్రి అని ప్రశ్నించారు. మహిళ కన్నీరు జగన్ ప్రభుత్వానికి శాపంగా మారబోతోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసుల పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వాలంటీర్లను రక్షిస్తున్నారని, ఇదేనా మీరు చెప్పిన రాజన్న రాజ్యం? అని ఆమె ప్రశ్నించారు.