ఈ నెల 22న దత్తత గ్రామానికి కేసీఆర్.. సామూహిక భోజనం

ABN , First Publish Date - 2021-06-18T21:18:48+05:30 IST

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 22న యాద్రాద్రి జిల్లాలో పర్యటించనున్నారు.

ఈ నెల 22న దత్తత గ్రామానికి కేసీఆర్.. సామూహిక భోజనం

హైదరాబాద్/యాదాద్రి జిల్లా : తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 22న యాద్రాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గులాబీ బాస్ పలు కీలక ప్రకటనలు చేయనున్నట్లు తెలుస్తోంది!. కాగా.. తుర్కపల్లి మండలం వాసాలమర్రిని కేసీఆర్ దత్తత తీసుకున్న విషయం విదితమే. గతేడాది ఈ ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా రూ.100 కోట్లతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. అంతేకాదు.. ఎర్రవల్లి తరహాలో వాసాలమర్రిని కూడా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ మళ్లీ దత్తత గ్రామానికి వెళ్తున్నారు. 


సీఎం పర్యటన నేపథ్యంలో వాసాలమర్రిలో ఏర్పాట్లను కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ క్రమంలో వాసాలమర్రి గ్రామ సర్పంచ్ అంజయ్యకు స్వయంగా ముఖ్యమంత్రే ఫోన్ చేసి మాట్లాడారు. ఊరంతా సామూహిక భోజనం చేద్దామని సర్పంచ్‌కు ఆయన చెప్పారు. అనంతరం గ్రామ సభ ఏర్పాటు చేసుకొని.. గ్రామ సమస్యలపై చర్చిద్దామని సర్పంచ్‌తో సీఎం మాట్లాడారు. సామూహిక భోజన ప్రదేశం, గ్రామ సభ నిర్వహణకు పెద్ద ఖాళీ స్థలాన్ని చూడాలని సర్పంచ్ అంజయ్యకు కేసీఆర్ సూచించారు. దీంతో సర్పంచ్ చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Updated Date - 2021-06-18T21:18:48+05:30 IST