అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి- కేసీఆర్‌

ABN , First Publish Date - 2020-08-16T00:53:44+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు వరదల నేపధ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు.

అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి- కేసీఆర్‌

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు వరదల నేపధ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల అనేక  చెరువులు అలుగులు పోస్తున్నాయి. కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల రోడ్లపై కి నీరు వచ్చింది. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వర్షాలు, వరదల పరిస్థితి పై శనివారం ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మంత్రులతో మాట్లాడారు. ఆయా జిల్లాల పరిస్థితిని సమీక్షించారు. తగు సూచనలు చేశారు. హైదరాబాద్‌లో రెండు కంట్రోల్‌రూంలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రులు తమ జిల్లాల్లోనే ఉండాలని స్ధానిక కలెక్టర్‌, పోలీస్‌ అధికారులతో కలిసి నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. 


చాలా చెరువులు పూర్తిస్థాయిలో నిండాయని ఫలితంగా కొన్నిచోట్ల చెరువులకు గండ్లుపడే అవకాశం ఉందని, వరదల వల్ల రోడ్లు తెగిపోయే ప్రమాదం ఉందని, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే పరిస్థితి ఉత్పన్నంకావచ్చని సీఎం చెప్పారు. ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైందని దాదాపు అన్ని చెరువులు అలుగుపోస్తున్నాయని చెప్పారు. ఆ రెండు జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం రెండు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచింది. వరదల వల్ల చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు వాటిని వినియోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హెలికాప్టర్‌తో పాటు సైనిక హెలికాప్టర్‌కూడా అందుబాటులోకి వచ్చింది. 

Updated Date - 2020-08-16T00:53:44+05:30 IST