కృష్ణా జలాల అంశంపై సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమావేశం

ABN , First Publish Date - 2021-07-07T04:16:35+05:30 IST

కృష్ణా జలాల అంశంపై సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. నదీ

కృష్ణా జలాల అంశంపై సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమావేశం

హైదరాబాద్: కృష్ణా జలాల అంశంపై సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. నదీ జలాల్లో రాష్ట్ర సాగునీటి వాటాను హక్కుగా పొందే వ్యూహంపై చర్చ జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు రాజీ లేకుండా పోరాడుతామని సీఎం కేసీఆర్‌  అన్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో తెలంగాణ వాణిని బలంగా వినిపిస్తామని కేసీఆర్‌  పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తెలంగాణకు జరుగుతున్న సాగునీటి వివక్ష గురించ చర్చించారు. స్వయంపాలనలో ఎట్టి పరిస్థితుల్లోనూ సాగునీటి కష్టాలు రానివ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. 



కృష్ణా నదీ జలాల వినియోగంలో, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వైఖరి, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతీసేలా వున్ననేపథ్యంలో, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తాము అన్ని వేదికల మీద రాజీ లేకుండా పోరాడుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు.  నదీ జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాను రాబట్టుకోవడంతో  సహా, తెలంగాణ లిఫ్టులను నడిపించుకునేందుకు జలవిద్యుత్ ఉత్పత్తి ని కొనసాగించాలని రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్స్, న్యాయస్థానాలు సహా రాబోయే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాను నిర్ధారించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు సందార్భాల్లో కేంద్రాన్ని  వత్తిడిచేస్తూ వస్తున్నది.  కృష్ణా  ట్రిబ్యునల్, కేఆర్ఎంబీ తదితర వేదికల మీద తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. నదీ జలాల్లో  రాష్ట్ర సాగునీటి వాటాను హక్కుగా పొందడానికి, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు దిశగా, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంగళవారం అత్యున్నతస్థాయి సమావేశం జరిగింది.


ఆరు గంటలకు పైగా జరిగిన సమీక్షా సమావేశంలో, తెలంగాణకు దశాబ్దాలుగా జరుగుతున్న సాగునీటి వివక్ష గురించి సమావేశం లోతుగా చర్చించింది. స్వయం పాలనలో సాగునీటి కష్టాలను  ఎట్టి పరిస్థితిల్లోనూ రానివ్వకూడదని సమావేశం తీర్మానించింది. రాష్ట్రం తరఫున ఎటువంటి వ్యూహాన్ని ఎత్తుగడలను అనుసరించాలనే విషయాలకు సంబంధించి  సమావేశంలో చర్చించిన సీఎం కేసీఆర్, అధికారులకు ఆ దిశగా మార్గనిర్దేశం  చేసారు.  



ఈ సమావేశంలో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, సిఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, సిఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, ఈఎన్సీ మురళీధర్ రావు, సిఎం వోఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే , అడ్వకేట్ జనరల్ బి.ఎస్. ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-07T04:16:35+05:30 IST