లోకేష్కు కేసీఆర్ ఫోన్.. వెంటనే రంగంలోకి ఉన్నతాధికారులు
ABN , First Publish Date - 2021-04-10T14:10:19+05:30 IST
వెంటనే అప్రమత్తమైన లోకేష్ జోనల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
హైదరాబాద్ : రెండో దశ వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉండడం, నియంత్రణ చర్యలు ముమ్మరం చేయాల్సిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు శుక్రవారం కమిషనర్ డీఎస్ లోకేష్కుమార్కు ఫోన్ చేశారు. ఉద్యోగులు అందరికీ వ్యాక్సినేషన్ చేయించాలని సూచించారు. వెంటనే అప్రమత్తమైన లోకేష్ జోనల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంస్థలోని ప్రతి ఒక్క ఉద్యోగికి వ్యాక్సిన్ వేయించాలని, ఈ నెల 15వ తేదీలోగా ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏ రోజుకారోజు వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలను కేంద్ర కార్యాలయానికి పంపడంతోపాటు కొవిడ్ పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. జీహెచ్ఎంసీలో రెగ్యులర్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు 30 వేల మంది ఉన్నారు. వీరిలో మెజార్టీ కరోనా నియంత్రణ చర్యల్లో పాల్గొననుండగా, ఇంకొందరు కార్యాలయాల్లో పౌర సేవలందిస్తున్నారు. 15వ తేదీ అనంతరం అధికారులు, ఉద్యోగులందరూ వ్యాక్సిన్ వేసుకునే కార్యాలయానికి రావాలన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్లు, ఇతర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నో వ్యాక్సిన్, నో ఎంట్రీ..
నో మాస్క్, నో ఎంట్రీ... కొవిడ్ అనంతరం ఇలాంటి నోటీసులు చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు నో వ్యాక్సిన్, నో ఎంట్రీ వంటి నోటీసులు దర్శనమిస్తున్నాయి. కూకట్పల్లిలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో మూసాపేటలో ఉన్న జోనల్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు అధికారులు కొత్త నిబంధన పెట్టారు. కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకొన్న వారు మాత్రమే కార్యాలయంలోకి ప్రవేశించాలంటూ ‘నో వ్యాక్సిన్... నో ఎంట్రీ’ బోర్డును పెట్టారు. కూకట్పల్లి జంట సర్కిళ్ల కార్యాలయాలకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఈ నిబంధన వర్తించనుందని జోనల్ కమిషనర్ వి.మమత తెలిపారు. వ్యాక్సిన్ తీసుకొన్నట్లు ధ్రువీకరించే సాఫ్ట్ లేదా హార్డ్ కాపీని సెక్యూరిటీ సిబ్బందికి చూపించిన తర్వాతే కార్యాలయంలోకి అనుమతించేలా చర్యలు తీసుకొన్నామని పేర్కొన్నారు. ఇకపై వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకే కూకట్పల్లి జీహెచ్ఎంసీ కార్యాలయంలో సేవలు అందనున్నాయన్న మాట.