కోవిడ్ పై అప్రమత్తంగా ఉండాలి- సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2020-11-23T00:30:58+05:30 IST
దేశంలోని కొన్ని రాష్ర్టాల్లో కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండి, అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్: దేశంలోని కొన్ని రాష్ర్టాల్లో కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండి, అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య మళ్లీ పెరగకుండా సెకండ్వేవ్ వచ్చినా తట్టుకునే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని వెల్లడించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, తగిన వ్యక్తిగత భద్రత పాటించడమే అసలైన మందు అని సీఎం సూచించారు. కోవిడ్ పరిస్థితి పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముర్తజా రిజ్వీ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, కార్యదర్శి స్మితాసబర్వాల్, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, మెడికల్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్రావు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్రెడ్డి, కోవిడ్ నిపుణల కమిటీ సభ్యుడు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
‘రాష్ట్రంలో మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి. తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గింది. పెద్దయెత్తున పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పదిశాతమే ఉంటోంది. రికవరీ రేటు 94.5 శాతం ఉంటున్నది. కోవిడ్ వచ్చిన వారు కొంత ఇ్బంది పడుతున్నప్పటికీ మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. రాష్ట్రవ్యాప్తంగా పదివేల బెడ్స్, ఆక్సీజన్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయి.
ఇంకా ఎన్నయినా సిద్ధం చేయగలం. ప్రస్తుతం మాత్రం పరిస్థితి అదుపులోనే వుంది’ అని సీఎం స్పష్టం చేశారు. ‘ ఢిల్లీ, రాజస్ధాన్, గుజరాత్, మహారాష్ట్ర , మధ్య ప్రదేశ్, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ర్టాల్లో కేసులు బాగా పెరుగుతున్నాయి. తమిళ నాడు, కర్నాటక, రాష్ర్టాల్లో కూడా కొద్దిగా పెరుగుతున్నాయి. దీంతో పాటు కోవిడ్ సెకండ్వేవ్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సెకండ్ వేవ్ వచ్చినా సరే తట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉండాలి. దానికి తగిన ఏర్పాట్లుచేయాలి’ అని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
‘కోవిడ్ వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం చేయాల్సినంత ప్రయత్నం చేస్తుంది. దీనికి ప్రజల సహకారం కూడా అవసరం. అన్లాల్ ప్రక్రియ నడుస్తున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండడమే అసలైన మందు. తప్పకుండా మాస్క్ధరించాలి. తగిన జాగ్రత్తలు పాటించాలి’ అని సీఎం సూచించారు. కోవిడ్కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ముందు ఆరోగ్య సిబ్బందికే ఇవ్వాలని నిర్ణయించినట్టు సీఎం తెలిపారు.