నిరుద్యోగుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలి: విజయశాంతి

ABN , First Publish Date - 2022-01-28T02:52:07+05:30 IST

నిరుద్యోగుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలి: విజయశాంతి

నిరుద్యోగుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలి: విజయశాంతి

హైదరాబాద్: ఉద్యోగ ఖాళీలపై సీఎం కేసీఆర్ మాటమార్చడంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది నిరుద్యోగులు బలవన్మరణానికి పాల్పడ్డారని, 7 ఏళ్లలో ఇప్పటి వరకు 200 మందికి పైగా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని టీఆర్ఎస్ సర్కారుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ ఖాళీలపై ఎన్నికలప్పుడు ఒక మాట, ఎన్నికలు అయిపోయాక ఒక మాట మాట్లాడే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్... నిరుద్యోగుల ఆత్మహత్యలకు బాధ్యత వహించాలని విజయశాంతి డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో రాములమ్మ పోస్టు యథాతథంగా..


''నీళ్లు, నిధులు, నియామకాలే ధ్యేయంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో విద్యార్థులు, నిరుద్యోగులు కోట్లాడి, బలిదానాలు చేసి రాష్ట్రాన్ని సాధిస్తే... టీఆర్ఎస్ సర్కార్ పాలనలో నేడు నిరాశే మిగిలింది. ఫలితంగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేక రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది నిరుద్యోగులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఏడేండ్లలో ఇప్పటి వరకు 200 మందికి పైగా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉద్యోగ ఖాళీలపై ఎన్నికలప్పుడు ఒక మాట, ఎన్నికలు అయిపోయాక ఒక మాట మాట్లాడే రాష్ట్ర ముఖ్యమంత్రి... నిరుద్యోగుల ఆత్మహత్యలకు బాధ్యత వహించాలి. తాజాగా మహబూబాబాద్  జిల్లాకు చెందిన ముత్యాల సాగర్ (25) అనే నిరుద్యోగ యువకుడి ఆత్మహత్యకు ముమ్మాటికీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. సాగర్ చదువు కోసం తల్లిదండ్రులు కష్టపడి డిగ్రీ వరకు చదివించగా... ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతూ మూడేండ్లుగా ఎదురుచూస్తే.. ప్రభుత్వం నుంచి ఒక్క నోటిఫికేషన్ రావడంలేదని నిరాశ, నిస్పృహతో విసుగుచెంది, సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేస్తూ... కేసిఆర్ పాలనలో ఉద్యోగాలు రావని నిర్ణయించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాగర్ ఆత్మహత్య వారి కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఇంకా రాష్ట్రంలో ఇలాంటి నిరుద్యోగుల కనబడని చావులు ఎన్ని ఉన్నాయోనని తలచుకుంటేనే బాధ కలుగుతుంది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఎంతో మంది నిరుద్యోగులు రాష్ట్ర సర్కార్ చేసే నిర్లక్ష్యానికి బలై  ఆత్మహత్యలు చేసుకుంటుంటే... సీఎం కేసీఆర్ మాత్రం కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటు. మద్యం షాపులకు క్రమం తప్పకుండా నోటిఫికేషన్లను ఇస్తున్న సీఎం కేసీఆర్... ఉద్యోగ ఖాళీల భర్తీకి మాత్రం నోటిఫికేషన్స్ ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తుండు. ఇలాంటి దుర్మార్గపు రాచరిక నియంతను రానున్న ఎన్నికల్లో యావత్ తెలంగాణ యువత కంకణబద్ధులై గద్దె దించడం ఖాయం.'' అని విజయశాంతి అన్నారు.



Updated Date - 2022-01-28T02:52:07+05:30 IST