తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ ఉగాది శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2021-04-13T00:50:27+05:30 IST

తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం ప్లవ నామ సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ ఉగాది శుభాకాంక్షలు

హైదరాబాద్‌: తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం ప్లవ నామ సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నీరు సమృద్ధిగా ప్రవహించడం ఈసంవత్సర ప్రాధాన్యతా పంంచాంగాలు చెప్తున్న నేపధ్యంలో తెలంగాణ వ్యవసాయానికి సాగునీరు మరింత సమృద్ధిగా లభించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యానికి ప్రకృతి కూడా తోడు కావడం శుభసూచకమని అన్నారు. వ్యవసాయ ప్రారంభ సంవత్సరంగా , రైతుపండువుగా ఉగాది ప్రసిద్ధిగాంచిందన్నారు. ఆకులు రాల్చిన ప్రకృతి కొత్త చిగురులతో వసంతాన్ని మోసుకొస్తూ, నూతనోత్తేజాన్ని సంతరించుకుంటూ పక్షుల కిలకిలారావాలంతో ఆహ్లాదకరమైన కొత్త జీవితానికి ఉగాది ఆహ్వానం పలుకుతుందని సీఎం తెలిపారు. 


వ్యవసాయానికి ముందస్తు ఏర్పాట్లను ఉగాది నుంచే రైతు ప్రారంభిస్తారని, రైతును వ్యవసాయానికి సంసిద్ధం చేసే ఉగాది రైతు జీవితంలో భాగమై పొయిందన్నారు. ప్రతి ఏటా చైత్ర మాసంలో ప్రారంభమయ్యే ఉగాది పండుగ నాడు పచ్చడిని సేవించడం గొప్ప ఆచారమని సీఎం అన్నారు. అప్పుడప్పుడే చిగురించే వేప పూతను, మామిడి కాతను, చేతికందే చింతపండులాంటి ప్రకృతి ఫలాలను తీపి, వగరు, చేదు రుచుల పచ్చడి సేవించి పండుగను జరుపుకోవదం గొప్ప సందేశాన్నిస్తున్నదని సీఎం అన్నారు. మనిషి జీవితంలోని కష్ట సుఖాలు, మంచి చెడుల వంటిజీవిత సారాన్ని తాత్వికంగా గుర్తుచేసుకునే గొప్ప సజీవ సాంప్రదాయానికి చిహ్నంగా ఉగాది పచ్చడినిసేవిస్తారని సీఎం తెలిపారు. 


ఉమ్మడి పాలనలోని చేదు అనుభవాలను చవి చూసిన తెలంగాణ రైతు, స్వయం పాలనలో తియ్యటి ఫలాలను అనుభవిస్తున్నారని అన్నారు. బ్యారేజీలు కట్టి, సొరంగాలు తవ్వి, లిఫ్టుల ద్వారా నీటిని ఎత్తిపోసి, నదీజలాలను సాగర మట్టానికి ఎత్తుమీద ఉన్న సాగు బీళ్లకు మళ్లించామని సీఎం గుర్తుచేశారు. తెలంగాణను కోటి  ఎకరాల మాగాణిని చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అనేక ప్రశంసలను అందుకుంటున్నదన్నారు. మండే వేసవిలో చెరువులను నిండు కుండలుగా మార్చి, రైతులకు పసిడి పంటలను అందిస్తున్నదన్నారు. పాలమూరు ఎత్తిపోతలు, ఆన్‌గోయింగ్‌ సాగునీటి ప్రాజెక్టులను మరి కొద్దినెలల్లో పూర్తిచేసుకోబోతున్నామని సీఎం చెప్పారు.


 


రైతు పండించిన పంటను ప్రభుత్వమే స్వయంగా కొనుగోలు చేసి రైతును కరోనా కష్టకాలంలో ఆదుకుంటున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా నిలిచిందన్నారు. విమర్శకుల అంచనాలను తారుమారు చేసి పంటల సాగు, ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానానికిచేరుకున్నదని అన్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి పధకాలు అందిస్తున్న భరోసాతో తెలంగాణ రైతు కుటుంబాల జీవితాల్లో కత్త ఆశాలు చిగురించాయన్నారు. విత్తనం నాటిన నుంచి పంట ఫలం చేతికొచ్చే దాకా రైతులకు అన్ని రకాల సాయం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం వారి కష్టాలను తన భుజాలమీద ఎత్తుకున్నదన్నారు. రైతును సంఘటిత పరిచేందుకు రైతు బంధుసమితులను ఏర్పాటు చేసి, ఊరూరా రైతుల కోసం వేదికలను నిర్మించిందన్నారు. 


గత ఉమ్మడి పాలనలో దండగన్న తెలంగాణ వ్యవసాయాన్ని తెలంగాణ ప్రభుత్వం పెద్దయెత్తున ప్రాధాన్యతనిస్తున్నదని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, 24గంటల విద్యుత్‌ సఫరా,  తదితర రైతు సంక్షేమ వ్యవసాయ అభివృద్ధి పథకాల అమలు కోసం ప్రతి ఏటా సుమారు 50 వేల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని సీఎం తెలిపారు. రైతు కుటుంబాల జీవితాల్లో వసంతాలను తెచ్చి, పున్నమి వెన్నెలలను నింపడమే తమ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-13T00:50:27+05:30 IST