సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన రద్దు
ABN , First Publish Date - 2022-01-18T08:40:19+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటన రద్దయింది. మంగళవారం ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించాల్సి ఉంది.
- తొలుత 2 నియోజకవర్గాల్లో పర్యటనకు షెడ్యూల్
- వర్షాలతో దెబ్బతిన్న పంటలను
- పరిశీలించాలని నిర్ణయం
- పరకాల, నర్సంపేటలో పర్యటించనున్న మంత్రులు
హనుమకొండ/వరంగల్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటన రద్దయింది. మంగళవారం ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పంటలకు జరిగిన నష్టాన్ని సీఎం ప్రత్యక్షంగా పరిశీలించి, పరకాల నియోజకవర్గంలోని పరకాల, నడికూడ మండలాలతోపాటు నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి లేదా నల్లబెల్లి మండలంలో పంటలు దెబ్బతిన్న గ్రామాల్లో బాధిత రైతులతో మాట్లాడుతారని తొలుత వార్తలు వచ్చాయి. వారికి పరిహారం చెల్లింపు విషయంలో భరోసా ఇచ్చేలా ఆయన పర్యటన సాగాల్సి ఉంది. సోమవారం ఉమ్మడి జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, ఆరూరి రమేశ్, గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, పోచంపల్లి శ్రీనివా్సరెడ్డి, హైదరాబాద్లో సీఎం కేసీఆర్ను ప్రగతిభవన్లో కలిసి అకాల వర్షం వల్ల జరిగిన పంటనష్టాన్ని ఆయనకు వివరించారు. దీంతో సీఎం వెంటనే స్పందించి.. తాను ఆయా ప్రాంతాల్లో స్వయంగా పర్యటిస్తానని చెప్పినట్టు తెలిసింది. అయితే..
సోమవారం కేబినెట్ భేటీ తర్వాత ఆయన తన ప్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం. కేవలం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఆ అధికారులు మాత్రమే ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు జిల్లా యం త్రాంగం వెల్లడించింది. కాగా, అకాల వర్షం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 42 వేల ఎకరాల్లో మిర్చి, మొక్కజొన్న, పసుపు పంటలతోపాటు పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. నష్టం సుమారు రూ.120 కోట్ల వరకు ఉండవచ్చునని ప్రాథమిక అంచనా.