సీఎం సారూ.. అపాయింట్మెంట్ ఇవ్వరూ!?
ABN , First Publish Date - 2021-05-14T08:57:43+05:30 IST
తమ సమస్యలను చెప్పుకొనేందుకు సీఎం కేసీఆర్ సమయం ఇవ్వాలని తెలంగాణ మెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ కోరింది
వైద్యుల సమస్యలు చెప్పుకొంటాం: టీఎస్ మెడికల్ జేఏసీ
మంగళ్హాట్, మే 13(ఆంధ్రజ్యోతి): తమ సమస్యలను చెప్పుకొనేందుకు సీఎం కేసీఆర్ సమయం ఇవ్వాలని తెలంగాణ మెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ కోరింది. ఈటల రాజేందర్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తమ డిమాండ్లను పరిష్కరిస్తానని హామీ ఇవ్వగా.. అవి నేటికీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. జేఏసీ చైర్మన్ బొంగు రమేశ్, కన్వీనర్, ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు పుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైద్యులకు, వైద్య సిబ్బందికి కరోనా సోకితే కనీసం బెడ్లు దొరికే పరిస్థితి లేని దైన్యం రాష్ట్రంలో ఉందన్నారు. ఆరోగ్య శాఖ ప్రస్తుతం సీఎం వద్దే ఉన్నందున తమకు అపాయింట్మెంట్ ఇచ్చి, సమస్యలు వివరించేందుకు అవకాశం కల్పించాలన్నారు. వైద్యులు కరోనాతో చనిపోతే ప్రభుత్వం తరఫున రూ.25లక్షల పరిహారం ఇస్తామన్న ఈటల మాట ఇప్పటికీ నెరవేరలేదన్నారు. వైద్యుల కుటుంబ సభ్యులకు కూడా టీకా ఇవ్వాలని డిమాండ్ చేశారు.