చేతులెత్తి అడుగుతున్నాను: సీఎం భావోద్వేగ విజ్ణప్తి

ABN , First Publish Date - 2021-09-16T00:42:52+05:30 IST

నీట్ పరీక్ష కారణంగా తమిళనాడులో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఈ వారంలోనే ముగ్గురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. తమిళనాడులో ఇది రాజకీయంగా పెద్ద దుమారం లేపింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా ముఖ్యమంత్రి స్టాలిన్..

చేతులెత్తి అడుగుతున్నాను: సీఎం భావోద్వేగ విజ్ణప్తి

చెన్నై: నీట్ పరీక్ష రాయబోయే విద్యార్థులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వేడుకున్నారు. బుధవారం ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఆత్మహత్యలకు పాల్పడవద్దని స్టాలిన్ భావోద్వేగంతో విద్యార్థులకు విజ్ణప్తి చేశారు.


‘‘నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. దయచేసి మీ జీవితాల్ని వదులుకోకండి. మీకు సాధ్యం కానిది ఇక్కడ ఏమీ లేదు. ఏకాగ్రతతతో, లక్ష్యాన్ని సాధించే విధంగా చదవండి. మంచి ఫలితాలు వస్తాయి. తల్లిదండ్రులు కూడా విద్యార్థుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్లకు తగినంత ప్రోత్సాహం, మనోధైర్యాన్ని కల్పించండి. మానసిక ఒత్తిడి నుంచి వారిని బయటకు రప్పించండి. నీట్‌ను తొలగించడానికి మేము ఒక అవకాశాన్ని క్రియేట్ చేశాం. దాన్ని అంతం చేసే వరకు పోరాడతాం’’ అని సీఎం స్టాలిన్ అన్నారు.


నీట్ పరీక్ష కారణంగా తమిళనాడులో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఈ వారంలోనే ముగ్గురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. తమిళనాడులో ఇది రాజకీయంగా పెద్ద దుమారం లేపింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా ముఖ్యమంత్రి స్టాలిన్.. తాజాగా నీట్ వ్యతిరేక బిల్లు పెట్టి అసెంబ్లీ ఆమోదం పొందారు కూడా. అయితే దీనికి గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం కావాల్సి ఉంది.

Updated Date - 2021-09-16T00:42:52+05:30 IST