శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
ABN , First Publish Date - 2021-10-12T03:13:12+05:30 IST
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్ద నుంచి పట్టువస్త్రాలను తలపై ఉంచుకుని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారికి వస్త్రాలు సమర్పించారు. దర్శనానంతరం ముఖ్యమంత్రికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలు, డ్రైఫ్లవర్ టెక్నాలజీతో చేసిన స్వామివారి చిత్రపటం, కాఫీ టేబుల్బుక్ అందజేశారు.
అంతకుముందు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఉపసభాపతి కోన రఘుపతి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, కన్నబాబు, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, ఎంపీలు గురుమూర్తి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మార్గాని భరత్, రెడ్డెప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు.