కో-ఆప్షన్ ఎన్నికల్లో బడంగ్పేట్ ‘డిప్యూటీ’ ఏ వైపు..!?
ABN , First Publish Date - 2020-08-04T09:50:26+05:30 IST
బడంగ్పేట్ కార్పొరేషన్లోని ఐదు కో-ఆప్షన్ పదవుల ఎంపిక కోసం ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న కౌన్సిల్ ప్రత్యేక
సరూర్నగర్, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): బడంగ్పేట్ కార్పొరేషన్లోని ఐదు కో-ఆప్షన్ పదవుల ఎంపిక కోసం ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్ ఏ పార్టీకి మద్దతు తెలుపుతారన్నది చర్చనీయాంశంగా మారింది. బాలాపూర్ 15వ వార్డు కార్పొరేటర్గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన ఆయన.. అనంతర పరిణామాల నేపథ్యంలో మంత్రి సబితారెడ్డి సహకారంతో డిప్యూటీ మేయర్ పదవి దక్కించుకున్నారు. టీఆర్ఎ్సకు మేయర్ పీఠం దక్కాలంటే అప్పటి పరిస్థితుల్లో శేఖర్ మద్దతు తప్పనిసరి కావడంతో ఆయన డిమాండ్ మేరకు డిప్యూటీ మేయర్ పదవి కట్టబెట్టారు.
ప్రస్తుతం జరగనున్న కో-ఆప్షన్ ఎంపికలో ఆయన ప్రమేయం లేకుండానే అధికార పార్టీ ఐదు స్థానాలను దక్కించుకునే అవకాశం ఉండడంతో శేఖర్ను ఆ పార్టీ పక్కనబెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. పైగా పోటీలో ఉన్న ఐదుగురు టీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఒక్కరు కూడా ఇంత వరకు ఆయనను మద్దతు కోసం సంప్రదించలేదని సమాచారం. దాంతో విషయం తెలుసుకున్న ప్రతిపక్ష పార్టీ నాయకులు శేఖర్ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో ఆయన ఎవరికి మద్దతు ఇస్తారన్నది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.