సంక్రాంతి నాటికి ‘డబుల్’ ఇళ్ల కేటాయింపు
ABN , First Publish Date - 2020-12-03T06:10:04+05:30 IST
ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి, ఉప్పలపహాడ్, భువనగిరి నియోజకవర్గంలో జిబ్లక్పల్లి, మునుగోడు నియోజకవర్గంలోని దండుమల్కాపురంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను, మౌలిక సౌకర్యాలను సంక్రాంతి నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించే విధంగా సిద్ధం చేయాలని కలెక్టర్ అనితారామచంద్రన్ అధికారులను ఆదేశించారు.
సమీక్ష సమావేశంలో కలెక్టర్ అనితారామచంద్రన్
యాదాద్రి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి, ఉప్పలపహాడ్, భువనగిరి నియోజకవర్గంలో జిబ్లక్పల్లి, మునుగోడు నియోజకవర్గంలోని దండుమల్కాపురంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను, మౌలిక సౌకర్యాలను సంక్రాంతి నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించేఫ విధంగా సిద్ధం చేయాలని కలెక్టర్ అనితారామచంద్రన్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె అదనపు కలెక్టర్ శ్రీనివా్సరెడ్డి డీఆర్డీవో ఉపేందర్రెడ్డి ఆర్డీవోలు, పంచాయతీరాజ్ ఆర్అండ్బీ ట్రాన్స్కో, ఇంజనీరింగ్ అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించి, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు, మౌలిక సౌకర్యాల కల్పనపై సమీక్ష నిర్వహించారు. తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ తదితర మౌలిక సౌకర్యాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలను అన్ని హంగులతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
కొవిడ్ పరీక్షలు పెంచాలి
భువనగిరి రూరల్ : కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ముందస్తుగా చేపడుతున్న కొవిడ్ పరీక్షలను పెంచాలని కలెక్టర్ అనితా రామచంద్రన్ వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ నుంచి ఆన్లైన్ గూగుల్ మీట్ కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం మాట్లాడారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రెండో విడత కరోనా ఉధృతి తీవ్రతరం అయిందన్నారు. తెలంగాణలో తీవ్రత లేనప్పటికీ నిర్లక్ష్యం వీడి అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అదేశించారు. జిల్లాలో కరోనాపై అవగాహన కార్యక్రమాలు విస్తృ తంగా చేపట్టాలన్నారు. కరోనా పరీక్షల సంఖ్య ఎట్టి పరిస్థితుల్లో తగ్గకుండా చూడాలన్నారు. జిల్లా వైద్యారోగ్య అధికారి డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 69,444 కరోనా పరీక్షలు చేయగా 9040 మందికి పాజిటీవ్ నమోదు కాగా 7,638 మంది రికవరీ అయినట్లు వివరించారు. 252 మంది యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. మిగిలిన వారు జిల్లాలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉంటున్నట్లు వివరించారు. గూగుల్ మీట్, అసిస్టెంట్ కలెక్టర్ గరీమా అగర్వాల్, కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు ఉన్నారు.
పిలాయిపల్లి ద్వారా సాగునీరు సాధ్యమా
భూదాన్పోచంపల్లి: భూదాన్పోచంపల్లిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ధ్వంసమైన పిలాయిపల్లికాల్వను, వరద తాకిడికి కొట్టుకుపోయిన బ్రిడ్జీలను పరిశీలించేందుకు కలెక్టర్ అనితారామచంద్రన్ బుధవారం భూదాన్పోచంపల్లిని సందర్శించారు. ఈ సందర్భంగా పిలాయిపల్లి కాల్వ 17వ కిలోమీటర్ నుంచి 19వ కిలోమీటర్ వరకు గల రెండు కిలోమీటర్ల వరకు పిలాయిపల్లి కాల్వను పరిశీలించారు. ఈ సందర్భంగా మెహర్నగర్ గ్రామాన్ని ఆమె పరిశీలించారు. మూసీ కాల్వను, శ్మశానవాటిక నిర్మాణ పనులు పరిశీలించారు. మూసీ కాల్వ కింద నష్టపోయిన రైతులకు నష్టపరిహారం గురించి భూ నిర్వాసితులు వినతిపత్రాన్ని అందజేశారు. మెహర్నగర్ గ్రామానికి ఏడు సంవత్సరాల క్రితం పిలాయిపల్లి మూసీ కాల్వలో భూమి, ఇళ్లు కోల్పయిన నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించాలని స్థానిక సర్పంచ్ సిరిపంగి స్వాతిమహేష్ కలెక్టర్కు విన్నవించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనితారామచంద్రన్ మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా పిలాయిపల్లి కాల్వ భూమి బాధితులకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తానన్నారు. కాల్వ మరమ్మతులు చేపట్టాలంటే కనీసం 2 నుండి 3 నెలల సమయం పడుతుందని అధికారులు తేల్చడంతో ఈ సీజన్లో రైతులకు సాగునీరు అందించడం సాధ్యమా, అసాధ్యమా అనే విషయాన్ని నిర్ధారిస్తామని తెలిపారు. మరో నెలలోగా సీజన్ సాగు పనులు ప్రారంభమవుతున్న దృష్ట్యా ఈ విషయంపై సంబంధిత శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. భూదాన్పోచంపల్లిలో డబుల్రోడ్డు నిర్మాణ పనుల జాప్యంపై కమిషనర్ ఎ.బాలశంకర్తో ఆరా తీశారు. త్వరితగతిన పనులు పూర్తి చేసేట్లు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కోట పుష్పలత మల్లారెడ్డి, పిలాయిపల్లి కాల్వ ఈఈ వేణుగోపాల్రావు, డీఈఈ కిష్ణారెడ్డి, ఏఈ సదానందం, మున్సిపల్ కమీషనర్ బాలశంకర్, స్థానిక సర్పంచు సిరిపంగి స్వాతి మహేష్ పాల్గొన్నారు.