యానాదులను ఆదుకుంటాం
ABN , First Publish Date - 2021-01-17T06:08:28+05:30 IST
యానాదులను ఆదుకుంటాం
ఉంగుటూరు, జనవరి 16 : వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న యానాదులను ఆదుకుంటామని కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. నూజివీడు సబ్కలెక్టర్ ప్రతిష్టా మాంగైన్, జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి రుక్మాంగదయ, తహసీల్దార్ ఆర్.దుర్గాప్రసాద్తో కలిసి పెదఅవుటపల్లి యానాదులకాలనీలో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో కాలువగట్టు పక్కన జీవిస్తున్న యానాదుల కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందటంలేదని రామారావు అనే సామాజిక కార్యకర్త ఫోన్లో తనకు ఫిర్యాదు చేసిన వెంటనే క్షేత్ర స్థాయిలో పరిశీలనకు వచ్చినట్టు తెలిపారు. గ్రామంలో 95 యానాదుల కుటుంబాలున్నాయని, వీరంతా నిరక్షరాస్యులని, 63 కుటుంబాలకు మాత్రమే రేషన్, ఆధార్కార్డులు ఉన్నాయని చెప్పారు. వీరందరికీ సొంత ఇల్లు మంజూరు చేశామని, మిగతా 32 కుటుంబాలకు సర్వే చేపట్టి ఆధార్కార్ఢు నమోదు చేయించి, త్వరలోనే రేషన్ కార్డుతో పాటు సొంత ఇంటిని కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.ఎస్సై. జి.శ్రీనివాసరావు, ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.