నాలుగు కేటగిరీల్లో.. నమూనాల సేకరణ
ABN , First Publish Date - 2020-07-07T09:59:11+05:30 IST
జిల్లాలో కరోనా వైరస్ పరీక్ష ల్యాబుల్లో వేల సంఖ్యలో పేరుకుపోతున్న నమూనాలను తగ్గించేందుకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ
ప్రాధాన్యతను తెలిపే ’కలర్ కోటెడ్’కు నిర్ణయం
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
గుంటూరు (మెడికల్), జూలై 6: జిల్లాలో కరోనా వైరస్ పరీక్ష ల్యాబుల్లో వేల సంఖ్యలో పేరుకుపోతున్న నమూనాలను తగ్గించేందుకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా నమూనాలకు ప్రాధాన్య క్రమంలో కలర్ కోటెడ్ విధానం అమలు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. ఇందుకోసం నాలుగు కేటగిరిల్లో నమూనాలను సేకరించి పరీక్షిస్తారు.
ఈ నెల మూడవ తేదీన కరోనా పరీక్షలు పెండింగ్ అనే శీర్షికన ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన వార్తా కథనానికి ప్రభుత్వం స్పందించింది. జిల్లాలో సుమారు 17 వేల కరోనా నమూనాలు పరీక్షలు ల్యాబుల్లో రోజుల తరబడి ఉండిపోతున్నట్లు ఈ వార్తాకథనంలో ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. ఇకపై జిల్లాలో కరోనా అనుమానితుల నుంచి సేకరించే శాంపిల్స్ను మూడు కేటగిరిలుగా విభజిస్తారు.
ఎక్స్ట్రీమ్లీ ఎమర్జెన్సీ కేటగిరి: దీనికి రెడ్కలర్ కేటాయించారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్తో పాటు హైప్రొఫైల్ వ్యక్తులు, కంటైన్మెంట్ జోన్లు, ఆసుపత్రుల్లో కోలుకొని డిశ్చార్జీ కోసం ఎదురుచూసే రోగులను ఈ కేటగిరిలో చేర్చారు. ఈ కేటగిరిలో నమునాలను గరిష్టంగా 12 గంటల్లోపు పరీక్షలు పూర్తి చేసి ఫలితాలను అందిస్తారు.
వెరీ అర్జెంట్ కేటగిరి: దీనికి ఆరంజ్ కలర్ కేటాయించారు. కరోనా వ్యాధి లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబు, ఆయాసంతో బాధపడే రోగులు, ఆరోగ్యసేవలు అందించే సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, మున్సిపాల్టీ సిబ్బందిని ఈ విభాగంలో చేర్చారు. 24 గంటల్లోపు ఈ నమూనాలను పరీక్షించి ఫలితాలు ప్రకటిస్తారు.
అర్జెంట్ కేటగిరి: దీనికి బ్లూ కలర్ కేటాయించారు. ఆరోగ్యశాఖ నిర్వహించే సీరో సర్వెలెన్స్, టార్గెట్ టెస్టింగ్ గ్రూప్లు, వృద్ధులు, హై రిస్క్ సమూహాలు, ఆరోగ్యసేతు హెచ్చరించే కేసులను ఈ విభాగంలోకి ఇస్తాయి. ఈ కేటగిరిలో రోగుల నమూనాలను గరిష్టంగా 36 గంటల్లోపు పరీక్షించి ఫలితాలు అందిస్తారు.
నార్మల్ కేటగిరి: దీనికి గ్రీన్ కలర్ కేటాయించారు. పైన పేర్కొన్న వారు మినహా మిగిలిన వారంతా ఈ గ్రూప్కి చెందుతారు. ఈ నమూనాలను గరిష్టంగా 48 గంటల్లోపు పరీక్షించి ఫలితాలు ప్రకటిస్తారు.