గండికోట పునరావాస పనులు వేగవంతం చేయాలి : కలెక్టర్
ABN , First Publish Date - 2020-05-17T11:17:02+05:30 IST
గండికోట పునరావాస పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ హరికిరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
కడప(కలెక్టరేట్), మే 16 : గండికోట పునరావాస పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ హరికిరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గండికోట ఆర్అండ్బీ పనులపై కలెక్టర్ ఛాంబరులో అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ భూములు కోల్పోయిన వారందరికీ పునరావాసానికి ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు రూ.145 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఈ నిధులతో నిర్వాసితులకు పరిహారం పంపిణీ చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే గండికోట రిజర్వాయర్లో 20 టీఎంసిల నీరు నిల్వలపై తీసుకోవాల్సి చర్యలపై చర్చించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గౌతమి, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ సతీష్చంద్ర, ప్రాజెక్టు సీఈ శ్రావణ్కుమార్, కొండా పురం తహసీల్దారు చంధ్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వలస కూలీలపై ఉదారత చూపాలి : సీఎస్
ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి ప్రవేశించి రహదారుల మీదుగా నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలపై ఉదారత చూపి వారికి రిలీఫ్ కేంద్రాల్లో భోజన, వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. శనివారం విజయవాడ నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ వలస కూలీలను మానవీయ కోణంలో వారిని ఆదుకునేందుకు వీలుగా బస్సులను నడపాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హ రికిరణ్, ఎస్పీ అన్బురాజన్, జాయింట్ కలెక్టర్ గౌతమి, జేసీ-2 శివారెడ్డి, ట్రైనీ కలెక్టర్ శ్రీవాస్ నూపూర్, డీఎంహెచ్వో డాక్టర్ ఉమాసుందరి తదితరులున్నారు.