ప్రైవేటు ఆస్పత్రులనూ సిద్ధం చేస్తున్నాం
ABN , First Publish Date - 2020-04-04T09:38:12+05:30 IST
‘ప్రస్తుతం తిరుపతిలోని కోవిడ్ ఆస్పత్రిలో 140 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లోని క్వారంటైన్లలో 1,600 బెడ్లున్నాయి.
శుక్రవారం కొత్త కేసులు నమోదవలేదు
అయినా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
కలెక్టర్ భరత్ గుప్తా
తిరుపతి (వైద్యం), ఏప్రిల్ 3: ‘ప్రస్తుతం తిరుపతిలోని కోవిడ్ ఆస్పత్రిలో 140 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లోని క్వారంటైన్లలో 1,600 బెడ్లున్నాయి. ఇవన్నీ దాటితేనే ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లనున్నాం. అయినా ముందుస్తుగానే ప్రైవేటు ఆస్పత్రులనూ సిద్ధం చేస్తున్నాం’ అని కలెక్టర్ భరత్ గుప్తా తెలిపారు. శుక్రవారం తిరుపతిలోని రుయాతోపాటు పలు ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో కరోనా పాజిటివ్ వచ్చిన తొమ్మిది మంది రుయాలోని ఐసొలేషన్ వార్డులో ఉన్నట్టు తెలిపారు. శుక్రవారం ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. అయినా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. రానున్న రోజులు చాలా కీలకమన్నారు.
నెగెటివ్ వచ్చిన వారికీ క్వారంటైన్ అవసరమన్నారు. రష్, నారాయణాద్రి ఆస్పత్రుల్లో క్వారంటైన్ ఏర్పాటుకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. చెవిరెడ్డి మాట్లాడుతూ.. తిరుచానూరు పద్మావతి నిలయంలోని క్వారంటైన్లోని వారికి ఎలాంటి ఇబ్బందుల్లేవన్నారు. 160 మందిలో దాదాపు 50 మందికిపైగా డిశ్చార్జి అవుతున్నారన్నారు. డీసీహెచ్ఎస్ సరళమ్మ, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ అరుణ సులోచన, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్వీ రమణయ్య, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ, వర్కింగ్ చైర్మన్ బండ్ల చంద్రశేఖర్, మెటర్నటీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భారతి, రుయా ఆర్ఎంవోలు డాక్టర్ ఇబి దేవి, డాక్టర్ హరికృష్ణ, రష్ ఆస్పత్రి అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, నారాయణాద్రి ఆస్పత్రి చైర్మన్ ఎస్.వి.ప్రసాద్, స్పెషల్ ఆఫీసర్ డ్వామా పీడీ చంద్రశేఖర్, తుడా కార్యదర్శి లక్ష్మి, జడ్పీ డిప్యూటీ సీఈవో రాజశేఖర్ రెడ్డి, తిరుచానూరు పంచాయతీ కార్యదర్శి జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.