అప్రమత్తంగా ఉండండి
ABN , First Publish Date - 2021-06-24T07:45:29+05:30 IST
వరదపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ మురళీధరరెడ్డి పేర్కొన్నారు. బుధవారం చింతూరు వచ్చిన ఆయన వరదపై సమీక్షించారు. కాఫర్ డ్యాం కారణంగా వరద ఉధృతి అఽధికంగా ఉంటుందన్న ఆందోళన లోతట్టు వాసుల్లో అలముకుందన్నారు.
- వరద సహాయక చర్యలపై కలెక్టర్ సమీక్ష
చింతూరు, జూన్ 23: వరదపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ మురళీధరరెడ్డి పేర్కొన్నారు. బుధవారం చింతూరు వచ్చిన ఆయన వరదపై సమీక్షించారు. కాఫర్ డ్యాం కారణంగా వరద ఉధృతి అధికంగా ఉంటుందన్న ఆందోళన లోతట్టు వాసుల్లో అలముకుందన్నారు. ఆ మేరకు అవసరమైన చర్యలు అధికార యంత్రాంగం ముందస్తుగానే చేపట్టనున్నందున ఆందోళన అవసరం లేదన్నారు. ముంపు ప్రాంతాలను ముందుగా గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పునరావాస కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. వరదల సమయంలో క్షేత్ర స్థాయిలో ఉండి సహాయక చర్యలు చేపట్టేందుకు సబ్ కలెక్టర్, ఆర్డీవో స్థాయి అధికారులకు బాధ్యత అప్పగించనున్నట్టు ఆయన తెలిపారు. తాత్కాలిక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు బాధితుల అవసరాలను గుర్తించి ఆ మేరకు చర్యలు చేపట్టాలన్నారు. 108, 104 వాహనాలను పునరావాస కేంద్రాలకు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. గర్భిణులు మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వైద్యశాలలకు ముందుగానే తరలించాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులను వరద సహాయక చర్యల విధుల్లో భాగస్వాములను చేయాలన్నారు. ఏ ప్రాంతంలోనైనా ప్రాణ నష్టం సంభవించినట్లైతే అక్కడ విధులు నిర్వర్తిస్తున్న అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామన్నారు. వరదలు తగ్గిన తర్వాత విద్యుత్, రహదారులు, తాగునీరు వంటి మౌలిక వసతులు వెనువెంటనే కల్పించాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, జాయింటు కలెక్టర్లు జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, శిక్షణా కలెక్టర్ గీతాంజలిశర్మ, చింతూరు, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు ఎ.వెంకటరమణ, ప్రవీణ్ఆదిత్య, ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి, వైసీపీ నేత అనంతఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.