సత్యదేవునికి కలెక్టర్ ప్రత్యేక పూజలు
ABN , First Publish Date - 2021-12-01T05:41:13+05:30 IST
రత్నగిరిపై వేంచేసియున్న సత్యదేవుడిని కలెక్టర్ హరికిరణ్ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అన్నవరం,
నవంబరు 30: రత్నగిరిపై వేంచేసియున్న సత్యదేవుడిని కలెక్టర్ హరికిరణ్
కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆయనకు ఈవో త్రినాథరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పీఆర్వో కొండలరావు,
రిసెప్షన్ అధికారి ఐవీ రామారావు తదితరులు పాల్గొన్నారు. కొవిడ్ ఆంక్షల
కారణంగా ప్రస్తుతం సాయంత్రం 5.30 గంటలకు ముగుస్తున్న దర్శనవేళలను
పొడిగించాలని కలెక్టర్ను అర్చకులు కోరగా రాత్రి 7.30 వరకు కొనసాగించేందుకు
సుముఖత వ్యక్తం చేశారు. ఏకాదశి పర్వదినం కావడంతో సుమారు 50 వేల మంది
భక్తులు స్వామిని దర్శించుకున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని
తెల్లవారుజామున రెండు గంటలకు వ్రతాలు, మూడు గంటల నుంచి సర్వదర్శనాలను
ప్రారంభించారు. మంగళవారం 5,105 వ్రతాలు జరగ్గా వివిధ విభాగాల ద్వారా సుమారు
రూ.55 లక్షల ఆదాయం లభించింది. సత్యదేవ నిత్యాన్నదాన పథకం ద్వారా సుమారు 20
వేల మందికి ఉచిత పులిహోర, దద్ధ్యోజనం ప్రసాదం పంపిణీ చేశారు. సత్యదేవ
నిత్యాన్నదాన పథకానికి గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన బి.సత్యనారాయణ
రూ.1,00,116 విరాళాన్ని సూపరింటెండెంట్ రమణకు అందజేశారు.