ఇంత అధ్వానయా?.. మళ్లీ రోడ్డెక్కిన కొవిడ్ బాధితులు
ABN , First Publish Date - 2020-08-13T08:31:09+05:30 IST
కొవిడ్ బాధితులు మళ్లీ రోడ్డెక్కారు. ఆసుపత్రిలో అసౌకర్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిప డ్డారు. ఈ నెల 9వ తేదీ ఆదోని టిడ్కోలో ఉన్న కొవిడ్
విశ్వభారతిలో అపరిశుభ్రతపై ఆగ్రహం
అన్నం సరిగా పెట్టడం లేదని మండిపాటు
ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు
కర్నూలు-బళ్లారి రోడ్డుపై బైఠాయింపు
నంద్యాలలో భోజనంపై కలెక్టర్ దృష్టికి..
మెనూ ప్రకారం ఆహారం అందిస్తాం
ఇప్పటికే టూరిజంశాఖతో మాట్లాడాం
కలెక్టర్ వీరపాండియన్ భరోసా
కర్నూలు(ఆంధ్రజ్యోతి): కొవిడ్ బాధితులు మళ్లీ రోడ్డెక్కారు. ఆసుపత్రిలో అసౌకర్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిప డ్డారు. ఈ నెల 9వ తేదీ ఆదోని టిడ్కోలో ఉన్న కొవిడ్ కేర్ సెంటర్లో సౌకర్యాలు, భోజనం సరిగా లేవని బాధితులు ఆందోళన చేశారు. మళ్లీ మూడు రోజుల వ్యవధిలో గూడూరు మండలం పెంచికలపాడు సమీపంలో ఉన్న విశ్వభారతి కొవిడ్ ఆసుపత్రిలో పారిశుధ్యం అధ్వానంగా ఉందని బాధితులు బుధవారం ఉదయం కర్నూలు-బళ్లారి రోడ్డుపై బైఠాయించారు. 50 మంది రోడ్డుపైకి వచ్చి ధర్నా చేశారు.
అధికారులు, ఆసుపత్రి యజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధితులు మాట్లాడుతూ ఆసుపత్రిలో బాత్రూంలను శుభ్రం చేయడం లేదన్నారు. తమకు వైద్యం అందడం లేదని, సమస్య వస్తే టాబ్లెట్లు ఇచ్చి సరిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు రెగ్యులర్గా రావడం లేదని, ఆహారం కూడా సరిగా ఉండటం లేదని బాధితులు వాపోయారు. ఇక్కడ తాము ఉండలేకపోతున్నామని, హోం క్వారంటైన్కు వెళ్తామని అన్నారు. ఆసుపత్రిలో అసౌకర్యాలపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. దాదాపు గంటసేపు రోడ్డుపైనే బాధితులు బైఠాయించడంతో వాహనాలు నిలిచిపోయి రాకపోకలు స్తంభించిపోయాయి.
ట్రైనీ డీఎస్పీ భవ్య కిషోర్, గూడూరు ఎస్ఐ శ్రీనాథ్ రెడ్డి, నాగులాపురం ఎస్ఐ, ఆసుపత్రి వైద్యులు బాధితులతో చర్చలు జరిపారు. పారిశుధ్యం మెరుగుపరిచి, మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు.
భోజనం కూడా సరిగా పెట్టరా?
తమకు భోజనం సరిగా అందడం లేదని కరోనా బాధితులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. బుధవారం నంద్యాలలోని ఎస్ఆర్బీసీ టిడ్కో గృహ సముదాయంలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ను కలెక్టర్ వీరపాండియన్ పరిశీలించారు. బాధితులకు అందుతున్న సౌకర్యాలు, వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంలో కొందరు కొవిడ్ బాధితులు తమకు భోజనం సరిగా ఇవ్వడం లేదని కలెక్టర్కు తెలిపారు. దీనిపై ఇప్పటికే టూరిజం శాఖతో మాట్లాడానని, ఇకనుంచి రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందిస్తామని కలెక్టర్ అన్నారు.
బాధితులకు ఆహారం కోసం ప్రభుత్వం రోజూ రూ.500 ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. మెనూ ప్రకారం ఆహారాన్ని అందిస్తామని, బాధితులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. ఎస్ఆర్బీసీ టిడ్కో గృహాల ఆవరణలో పరిశుభ్రతపై అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణను కలెక్టర్ ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని నోడల్ అధికారి, సిబ్బంది, వైద్యులకు సూచించారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, తహసీల్దార్ రవి కుమార్ ఉన్నారు. అనంతరం.. ఈనెల 14న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తున్న ఉదయానంద ప్రైవేటు ఆసుపత్రిని కలెక్టర్ పరిశీలించారు.
ఆసుపత్రి డైరెక్టర్, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ప్రజలకు అందించనున్న సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను కలెక్టర్కు వివరించారు. ఆసుపత్రి ప్రారంభమైన తరువాత కొవిడ్ ఆసుపత్రిగా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి తెలిపారు.