ఎన్నికలు నిస్పక్షపాతంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-03-02T05:37:24+05:30 IST

జిల్లాలో మునిసిపల్‌ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిస్పక్షపాతంగా నిర్వహించేందుకు బాధ్యతగా విధులు నిర్వహించాలని ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్‌ రెవెన్యూ, మునిసిపల్‌, పోలీసు శాఖ అధికారులను ఆదేశించారు.

ఎన్నికలు నిస్పక్షపాతంగా నిర్వహించాలి
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతున్న కలెక్టర్‌

గుంటూరు, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మునిసిపల్‌ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిస్పక్షపాతంగా నిర్వహించేందుకు బాధ్యతగా విధులు నిర్వహించాలని ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్‌ రెవెన్యూ, మునిసిపల్‌, పోలీసు శాఖ అధికారులను ఆదేశించారు. మునిసిపల్‌ ఎన్నికల ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన సబ్‌ కలెక్టర్లు, ఆర్‌డీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు, డీఎస్‌పీలు, తహసీల్దార్లతో మాట్లాడారు. ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులు, పోటీలో ఉన్న అభ్యర్థులకు కాపీ అందించాలని సూచించారు. ప్రతీ మునిసిపాలిటీలో అభ్యర్థులు ప్రచారం కోసం నిర్వహించే ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతులు మంజూరు చేసేందుకు సింగిల్‌ విండో డెస్క్‌ని ఏర్పాటు చేయాలన్నారు. ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు ప్రచార కార్యక్రమాలు విస్త్రృతం చేయాలన్నారు. ఎన్నికలు మూడు రోజుల ముందు నుంచే స్లిప్పుల పంపిణీ చేయాలన్నారు. జేసీ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ కొవిడ్‌-19 నిబంధనల ప్రకారం ప్రచార కార్యక్రమాల్లో అభ్యర్థితో పాటు ఐదుగురికి మించి వ్యక్తులు పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జేసీ శ్రీధర్‌రెడ్డి, ఎన్నికల నోడల్‌ అధికారులు విజయ్‌కుమార్‌(డీఎఫ్‌వో), శ్రీనీవాసరెడ్డి(డ్వామా పీడీ), ఆనంద్‌నాయక్‌(డీఆర్‌డీఏ పీడీ), డేవిడ్‌ రాజు(పులిచింతల ఎస్‌డీసీ), కొండయ్య(డీపీవో), మధుసూదనరావు(సాంఘిక సంక్షేమ శాఖ డీడీ), మనోరమ(ఎస్‌డీసీ), చల్లా అనురాధ(జీఎంసీ కమిషనర్‌), భాస్కర్‌రెడ్డి(ఆర్‌డీవో) పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-02T05:37:24+05:30 IST