బడులు తెరిచేనాటికి పనులు పూర్తవ్వాలి

ABN , First Publish Date - 2020-06-05T11:12:54+05:30 IST

పాఠశాలలు తెరిచే నాటికి నాడు-నేడు, మనబడి పనులన్నీ నూరుశాతం పూర్తి చేయాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి ..

బడులు తెరిచేనాటికి పనులు పూర్తవ్వాలి

కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి


కాకినాడ, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలు తెరిచే నాటికి నాడు-నేడు, మనబడి పనులన్నీ నూరుశాతం పూర్తి చేయాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి నిర్వహించిన మండల స్థాయి వీడియో కాన్ఫెరెన్స్‌ (వీసీ) లో పనుల పురోగతిపై క్షేత్రస్థాయి అధికారులతో ఆయన సమీక్షించారు. సమయం తక్కువ ఉన్నందున పాఠశాలలో అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. పాఠశాలలు తెరిచే నాటికి కొత్త వాతావరణం కల్పించాలన్నారు. కొన్ని చోట్ల హెచ్‌ఎంలు పాఠశాలలకు సక్రమంగా వెళ్లకపోవడం, కొన్ని ప్రాంతాల్లో పేరెంట్‌ కమిటీలకు పాఠశాలల్లో జరుగుతున్న పనుల గురించి తెలియకపోవడం వంటి విషయాలు తన దృష్టికి వచ్చాయన్నారు. హెచ్‌ఎంలు పనితీరు మార్చుకోవాలని సున్నితంగా హెచ్చరించారు. పేరెంట్‌ కమిటీలకు ఆ ప్రాంతాల పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి వివరించే బాధ్యత, పనుల్లో వారి చొరవ ఉండేలా ఎంఈవోలు దృష్టి సారించాలన్నారు.


నిర్లక్ష్యం వహించే ఎంఈవో, హెచ్‌ఎం, ఇతర సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. జాయింట్‌ కలెక్టర్‌ సీహెచ్‌ కీర్తి మాట్లాడుతూ భావితరాలకు భవిష్యత్తులో గుర్తుండిపోయేలా పాఠశాలల నిర్మాణ పనులు జరగాలన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడేదిలేదన్నారు. ప్రతి హెచ్‌ఎం ఎస్‌టీఎంఎస్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని లాగిన్‌ అవ్వాలన్నారు. స్టాక్‌ రిజిస్టర్‌ సక్రమంగా నిర్వహించడంతో పాటు హెచ్‌ఎంలు విధిగా ప్రతిరోజూ బయోమెట్రిక్‌ హాజరు వేయాలన్నారు. సమావేశంలో డీఈవో ఎస్‌.అబ్రహాం, ఎస్‌ఎస్‌ఎస్‌ ఏపీసీ బి.విజయభాస్కర్‌, డిప్యూటీ డీఈవోలు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-05T11:12:54+05:30 IST