798 పాల శీతలీకరణ యూనిట్ల నిర్మాణం
ABN , First Publish Date - 2021-01-21T06:40:35+05:30 IST
జిల్లాలో పాడిపరిశ్రమ అభివృద్ధికిగానూ రూ. 125.61 కోట్లతో 798 పాల శీతలీకరణ యూనిట్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు.
రెండ్రోజుల్లో పనులు ప్రారంభం..
కలెక్టర్ గంధం చంద్రుడు
అనంతపురం, జనవరి 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పాడిపరిశ్రమ అభివృద్ధికిగానూ రూ. 125.61 కోట్లతో 798 పాల శీతలీకరణ యూనిట్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. రెండ్రోజుల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. ఆ మేరకు పరిపాలన ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన బుధవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల ఆధ్వర్యంలో బల్క్మిల్క్ యూనిట్ల నిర్మాణం చేపట్టనున్నామన్నారు. జిల్లాలోని ప్రతి రైతు భరోసా కేంద్రం వద్ద ఐదు సెంట్ల స్థలంలో ఒక్కో శీతలీకరణ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, అమూల్ సంస్థతో అనుసంధానమై వీటిని నిర్వహిస్తోందన్నారు. గ్రామాల్లో డ్వాక్రా మహిళలతో కో-ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేసి, వారి ద్వారా పాల సేకరణ చేపడతామన్నారు. వాటిని అమూల్ సంస్థ మార్కెటింగ్ చేస్తుందన్నారు. రైతులకు బయటి మార్కెట్ కంటే పాల ధర లీటరుకు కనీసం నాలుగైదు రూపాయలు అదనంగా వచ్చే అవకాశముందని కలెక్టర్ తెలిపారు.