కొవిడ్ నిబంధనల ప్రకారం ప్రవేశ పరీక్షలు నిర్వహించాలి
ABN , First Publish Date - 2020-09-27T12:38:45+05:30 IST
కరోనా నిబంధనల ప్రకారం ప్రవేశ పరీక్షలను నిర్వహించాలని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. శనివారం కలెక్టరేట్లోని...
అదనపు కలెక్టర్ రాంబాబు
ఆసిఫాబాద్, సెప్టెంబరు26: కరోనా నిబంధనల ప్రకారం ప్రవేశ పరీక్షలను నిర్వహించాలని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ జూనియర్ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలల్లో కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షను ఈ నెల30న ఉదయం 10గంటల నుంచి 12.30గంటల వరకు నిర్వహిస్తామన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రెండు గంటల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, శానిటైజర్ వెంట తెచ్చుకోవాలన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అన్నారు. జిల్లాలో నాలుగు కేంద్రాలైన జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ జిల్లా పరిషత్, తెలంగాణ మోడల్ స్కూల్, ఇంటర్ విద్యార్థుల కోసం పరీక్షలు నిర్వహిస్తారన్నారు. డిగ్రీ విద్యార్థులకు ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్ఈఐఎస్ బాలుర, తెలంగాణ మోడల్ స్కూల్లలో పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ సమావేశంలో డీఆర్ఓ సురేష్, ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ గోపిచంద్, కన్వీనర్ రాజయ్య, విద్యాశాఖాధికారి పాణిని, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.