నాడు– నేడు పనులపై కలెక్టర్ సీరియస్
ABN , First Publish Date - 2021-02-25T05:29:54+05:30 IST
మనబడి, నాడు–నేడు పనులు త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు అధికారులను ఆదేశించారు.
ఏలూరు, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): మనబడి, నాడు–నేడు పనులు త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అంచనాలు లేని పనులు కొత్తగా చేయ డానికి వీలు లేదని స్పష్టం చేశారు. కరోనా కాలంలో పనిచేయక పోయినా, ఆ తరువాత కాలంలో కూడా పనులు పూర్తి కాలేక పోవడంపై కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు. పనుల్లో నిధులు వృథాని తగ్గించామని చెబుతున్నా కొన్నిచోట్ల ఎక్కువ ఖర్చ య్యాయని ఆయన సీరియస్ అయ్యారు. భీమవరం మండలంలో 70కి పైగా మేజర్, మైనర్ పనులు పెండింగులో ఉండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో డీఈవో రేణుక, పీఆర్ ఎస్ఈ చంద్రభాస్కర్ రెడ్డి,ఎంఈవోలు,ఏఈలు పాల్గొన్నారు.
పనుల పురోగతికి నోడల్ టీమ్లు
ఏలూరుఎడ్యుకేషన్, ఫిబ్రవరి 24: జిల్లాలో ఎంపిక చేసిన 1,117 ప్రభుత్వ పాఠశాలల్లో నత్తనడకన సాగుతున్న నాడు–నేడు పనుల వేగవంతానికి మండలస్థాయిలో నోడల్ టీమ్లను ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ నిర్ణయించింది. ఒక్కో టీమ్లో టీచర్, అకౌంట్స్ ఆఫీసర్, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్ ఉంటారు. ఈ బృందం పనులు జరుగుతున్న పాఠశాలలను సందర్శించి పనుల పురో గతిపై అక్కడికక్కడే నివేదిక రూపొందించి సంబంధిత మండల విద్యాధికారి, ఇంజనీరింగ్ సిబ్బందిని సమన్వయపరుస్తుంది.