కళాశాలలకు ఊరట
ABN , First Publish Date - 2020-07-18T11:34:29+05:30 IST
సుప్రీంకోర్టు తీర్పుతో ఇంజనీరింగ్, వృత్తి విద్యా కళాశాలలకు ఊరట లభించింది. జిల్లాలో ప్రధానంగా 17 ఇంజ నీరింగ్ కళాశాలలు ..
ఇంజనీరింగ్కు పాత ఫీజులే ఖరారు
బకాయిల విడుదలకు మార్గం సుగమం
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఉపశమనం
(తాడేపల్లిగూడెం-ఆంధ్రజ్యోతి) : సుప్రీంకోర్టు తీర్పుతో ఇంజనీరింగ్, వృత్తి విద్యా కళాశాలలకు ఊరట లభించింది. జిల్లాలో ప్రధానంగా 17 ఇంజ నీరింగ్ కళాశాలలు ఉన్నాయి. అందులో 10 కళాశాలలకు ఫీజులు అధికంగా ఉన్నాయి. ప్రభుత్వం నియమించిన అడ్మిషన్లు, ఫీజు నియంత్రణ కమిటీలే ఆ ఫీజులను నిర్ధారించాయి.గత ప్రభుత్వం వాటిని అంగీకరించి ఫీజు రీఎంబర్స్ మెంట్ అమలులోనూ ఒక నిర్ధిష్టమైన విధానాన్ని అమలు చేసింది. గత ప్రభుత్వ హయాంలో బకాయిలు కొంత మేర మిగిలిపోయాయి. ప్రభుత్వం మారడంతో ఆ ఫీజులను చెల్లించేందుకు ప్రస్తుత ప్రభుత్వం అనేక కొర్రీలు పెడుతూ వచ్చింది.కళాశాలలకు గరిష్ట ఫీజును తామే నిర్ణయిస్తామని చెప్పు కొచ్చింది.తాము నిర్ధారించిన ఫీజులకు సమ్మతించిన కళాశాలలకు మాత్రమే గత బకాయిలను విడుదల చేస్తామని స్పష్టం చేసింది.అయితే చాలా కాలం ఇంజనీరింగ్ కళాశాలలు దిగిరాలేదు.బకాయిలు విడుదల చేయకపోవడంతో పీకల్లోతు ఆప్పుల్లో కూరుకుపోయాయి.
సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని దుస్థితికి చేరుకున్నాయి.ఈ క్రమంలోనే కొన్ని కళాశాలలు ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీక రించక తప్పలేదు.జిల్లాలో ఆ కళాశాలలకు మాత్రమే ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేశారు. అంగీకరించని కళాశాలలు కోర్టు మెట్లు ఎక్కాయి.వారికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో పెద్ద ఊరటే లభించింది. జిల్లాలో 10 కళాశాలలకు సుప్రీం తీర్పు లబ్ధి చేకూర్చనుంది.ఎప్పటి లాగే పాత ఫీజులు అమలు కానున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా పాత ఫీజులనే ఖరారు చేస్తూ సిఫార సు చేసింది.