బొమ్మకు దెబ్బ తగిలిందని 911కు ఫోన్ చేసిన బాలిక.. అమెరికాలో..

ABN , First Publish Date - 2020-03-03T02:26:53+05:30 IST

పసిపిల్లలకు ఏ ఒక్కరిపై కోపం, పగ లాంటివి ఉండవు. వారికి ఆనందాన్నిస్తున్న వస్తువులు, విషయాల గురించి తప్ప వారికి మరో ధ్యాస అంటూ ఉండదు.

బొమ్మకు దెబ్బ తగిలిందని 911కు ఫోన్ చేసిన బాలిక.. అమెరికాలో..

కొలరాడో: పసిపిల్లలకు ఏ ఒక్కరిపై కోపం, పగ లాంటివి ఉండవు. వారికి ఆనందాన్నిస్తున్న వస్తువులు, విషయాల గురించి తప్ప వారికి మరో ధ్యాస అంటూ ఉండదు. డబ్బు, అధికారం అంటే ఏంటో కూడా వారికి తెలీదు. ఈ కారణంగానే పసిపిల్లలను దేవుడితో పోల్చుతారేమో. ఇప్పడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. అమెరికాలో నటాలి అనే ఆరేళ్ల పాప.. ఆడుకుంటున్న బొమ్మకు దెబ్బ తగిలిందంటూ పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికా ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా.. 911కు ఫోన్ చేస్తారు. ఎన్నో ఏళ్ల నుంచి వాడని ఫోన్‌ను తన కూతురుకు ఆడుకోడానికని నటాలి తల్లి ఇచ్చింది. అయితే నటాలి ఆ ఫోన్ నుంచి ఎమర్జెన్సీ కాల్ చేసింది. పోలీసులు లైన్‌లోకి రాగా.. నటాలి తను పెంచుకుంటున్న జంతువుకు దెబ్బ తగిలిందని చెప్పి ఫోన్ కట్ చేసేసింది. వెంటనే లొకేషన్‌ను ట్రేస్ చేసి ఇద్దరు పోలీసు అధికారులు నటాలి ఇంటికి చేరుకున్నారు. 


అక్కడికి చేరుకున్నాక అది జంతువు కాదని.. బొమ్మ అని అధికారులు తెలుసుకున్నారు. నటాలిని ఏం జరిగిందని అడగగా.. తన బొమ్మకు దెబ్బ తగిలిందంటూ వివరించింది. బొమ్మకు బ్యాండేజ్ వేద్దామా అంటూ పోలీసులు నటాలికి నచ్చచెప్పారు. బొమ్మకు దెబ్బ తగిలితే పోలీసులకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదని.. ఇంట్లో ఎవరికైనా ఏదైనా జరిగితే మాత్రం వెంటనే ఫోన్ చేయాలంటూ పోలీసులు నటాలికి వివరించారు. బాలిక తమతో మాట్లాడిన ఆడియో సంభాషణను సైతం పోలీసులు తమ ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా.. తన కూతురుకు పనిచేయని ఫోన్ ఇచ్చానని.. అనుకోకుండా ఆ ఫోన్ నుంచి ఎమర్జెన్సీ కాల్ వెళ్లినట్టు నటాలి తల్లి పోలీసులకు తెలిపింది. 

Updated Date - 2020-03-03T02:26:53+05:30 IST