పశువుల కొట్టానికి నిప్పు
ABN , First Publish Date - 2021-01-17T04:46:05+05:30 IST
పశువుల కొట్టానికి నిప్పు
- మూడు గేదెలు, మూడు లేగదూడలు సజీవ దహనం
శంషాబాద్: గుర్తుతెలియని వ్యక్తులు పశువుల కొట్టానికి నిప్పంటించగా మూడు గేదెలు, మూడు గేదె దూడలు సజీవదహనం అయ్యాయి. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హుడా కాలనీలో నివాసముండే ప్రేమ్కుమార్కు అదే ప్రాంతంలో పొలం ఉంది. గేదెలను సాదుతూ పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవలే రూ.6లక్షలు పెట్టి మూడు గేదెలు కొన్నాడు. వాటికి మూడు దూడలున్నాయి. శుక్రవారం రాత్రి మార్కెట్లో పాలు అమ్మి ఇంటికి వచ్చాడు. శనివారం ఉదయం పశువుల కొట్టం వద్దకు వెళ్లి చూడగా దగ్ధమై ఉంది. పశువులూ కాలిపోయాయి. దీంతో ప్రేమ్కుమార్, అతడి కుటుంబం కన్నీరుమున్నీరైంది. వారి ఫిర్యాదుతో సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మున్సిపల్ చైర్పర్సన్ సుష్మా, నార్సింగి ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వేడుకున్నాడు.