కమ్మేస్తున్న కరోనా!
ABN , First Publish Date - 2022-01-23T06:33:09+05:30 IST
విద్యాసంస్థల్లో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది.గత ఐదురోజుల్లో 230 మందికి కొవిడ్ సోకగా శనివారం ఒక్కరోజే మరో 49 మంది టీచర్లకు కరోనా నిర్ధారణ అయింది.
పాఠశాలల్లో మరో 49 కేసులు
చిత్తూరు (సెంట్రల్), జనవరి 22: విద్యాసంస్థల్లో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది.గత ఐదురోజుల్లో 230 మందికి కొవిడ్ సోకగా శనివారం ఒక్కరోజే మరో 49 మంది టీచర్లకు కరోనా నిర్ధారణ అయింది.జిల్లాలో ప్రభుత్వ ప్రభుత్వ యాజమాన్యంలో 16,770మంది, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో 136మంది, ప్రైవేటు యాజమాన్యాల కింద 8771మంది మొత్తం 25677మంది టీచర్లున్నారు. 201మంది మినహా అందరూ వ్యాక్సిన్ వేసుకున్నారు. 21,789మంది డబుల్ డోస్ వేసుకోగా 3686మంది సింగిల్ డోస్ వేసుకున్నారు.టెన్త్ చదువుతున్న 52వేలమంది విద్యార్థులకు తొలి డోస్ వ్యాక్సిన్ వేశారు.దీంతో కరోనా సోకిన ఉపాధ్యాయులు, విద్యార్థులు హోమ్ ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.తీవ్ర జ్వరంతో పాటు దగ్గు, జలుబు, ఒంటి నొప్పులకు ఇంటివద్దే మాత్రలు వాడుకుంటున్నారు.దీంతో పాఠశాలల్లో ఇప్పటిదాకా 270 మందికి కరోనా సోకినా, ఏ ఒక్క పాఠశాలను మూసి వేయడానికి అధికారులు ముందుకు రాలేదు. ఇక ప్రైవేటు యాజమాన్య పాఠశాలల్లో పరిస్థితులను సమీక్షించే నాథుడు కరువయ్యాడు. ఇప్పటివరకూ ఎక్కడా పాఠశాల గదులకు శానిటైజేషన్ చేసిన దాఖలాలు కనిపించకపోగా, విద్యార్థులకు శానిటైజర్లు కూడా అందుబాటులో ఉంచలేదు.అదేమంటే శానిటైజర్లు ఏర్పాటు చేయడానికి నిధుల్లేవని ఉపాధ్యాయులు చేతులెత్తేస్తున్నారు. ఇక వాష్రూముల్లో శుభ్రతను పాటించడంలేదు. పాఠశాలల్లో కరోనా కేసులు పెరగడంపై డీఈవో శేఖర్తో మాట్లాడగా కలెక్టర్, డీఎం అండ్ హెచ్వోతో మాట్లాడి ఉపాధ్యాయులకు థర్డ్ డోస్ ఇప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పారు.