చింతపల్లి కొవిడ్ కేర్ సెంటర్లో సేవలు ప్రారంభం
ABN , First Publish Date - 2021-05-17T04:22:29+05:30 IST
స్థానిక వైటీసీలో ఐటీడీఏ ఏర్పాటుచేసిన కొవిడ్ కేర్ సెంటర్లో సేవలు ప్రారంభమయ్యాయని పర్యవేక్షకులు, ఏటీడబ్ల్యూవో చంద్రశేఖరరావు తెలిపారు.
చింతపల్లి, మే 16: స్థానిక వైటీసీలో ఐటీడీఏ ఏర్పాటుచేసిన కొవిడ్ కేర్ సెంటర్లో సేవలు ప్రారంభమయ్యాయని పర్యవేక్షకులు, ఏటీడబ్ల్యూవో చంద్రశేఖరరావు తెలిపారు. ఆదివారం స్థానిక విలేకర్లతో ఆయన మాట్లాడుతూ.. తొలిరోజు ఏడుగురు కొవిడ్ రోగులను కేర్ సెంటర్లో చేర్చుకోవడం జరిగిందన్నారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారని, బాధితులు చింతపల్లి, జీకేవీధి మండలాలకు చెందినవారన్నారు. ప్రస్తుతం ఏడుగురి ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని, రోగులకు సీహెచ్సీ వైద్యులు మందులను అందజేశారని, కేర్ సెంటర్లో రోగులకు బెడ్లు కేటాయించామన్నారు. రోగులకు మెనూ ఆధారంగా అల్పాహారం, భోజనం, స్నాక్స్, రాత్రి భోజనం అందజేస్తామన్నారు. రోగులను పర్యవేక్షించేందుకు వైద్యసిబ్బంది అందుబాటులో ఉన్నారని, సోమవారం నుంచి కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి మండలాల్లో పాజిటివ్లు వచ్చిన రోగులను కేర్ సెంటర్లో చేర్చుకోవడం జరుగుతుందన్నారు. విలేకర్ల సమావేశంలో నోడల్ అధికారి, ఈవోపీఆర్డీ పీఆర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.