సంస్థకు చెందిన విలువైన సమాచారం, పత్రాలు చోరీ
ABN , First Publish Date - 2021-03-07T12:04:47+05:30 IST
ఓ ప్రైవేట్ సంస్థలో చేరిన మెకానికల్ ఇంజనీర్ మూడు నెలల్లో సంస్థ కార్యకలాపాలపై అవగాహన పెంచుకుని
హైదరాబాద్/హిమాయత్నగర్ : ఓ ప్రైవేట్ సంస్థలో చేరిన మెకానికల్ ఇంజనీర్ మూడు నెలల్లో సంస్థ కార్యకలాపాలపై అవగాహన పెంచుకుని మోసాలకు తెగబడ్డాడు. సంస్థకు చెందిన విలువైన పత్రాలు, ఇతరత్రా వివరాలను చోరీ చేశాడు. వివరాలిలా ఉన్నాయి... బేగంపేట్ ప్రకాష్నగర్కు చెందిన ఓ సంస్థ రెండేళ్లుగా స్మార్ట్ టాయ్లెట్ సీట్స్ రూపకల్పనతో పనిచేస్తోంది. త్వరలోనే సంస్థ ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ క్రమంలో మూడు నెలల క్రితం మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన యువకుడు ఉద్యోగంలో చేరాడు. ఇటీవల ఉన్నఫలంగా ఉద్యోగం మానేశాడు. అయితే సంస్థకు చెందిన అత్యంత విలువైన సమాచారం, కాన్సెప్ట్స్, ఇతరత్రా పత్రాలు, కంప్యూటర్ డిస్క్లలో నిక్షిప్తమై ఉన్న వివరాలను కూడా ఈ-మెయిల్ ద్వారా తస్కరించాడు. అతడు అన్ని చోరీ చేసినట్లు ఆధారాలు సేకరించిన సంస్థ ప్రతినిధులు శనివారం సైబర్క్రైమ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.