బాధితులందరికీ పరిహారం ఇవ్వండి
ABN , First Publish Date - 2021-08-01T05:18:36+05:30 IST
జిరాయితీలో నిర్మించే భవనాలు తొలగించే అధికా రం ఎవరికీ లేదని, అభివృద్ధి పేరుతో పట్టణంలో మానవహక్కులు ఉల్లంఘించేలా కేటీరోడ్డు విస్తరణలో షాపులు, గృహాలు తొలగించారని టీడీపీ కౌన్సిలర్ వజ్జ బాబూరావు ఆరోపించారు. నిబంధనల మేరకు బాధితులందరికీ నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శనివారం పలాస-కాశీబుగ్గ మునిసి పల్ చైర్మన్ బళ్ల గిరిబాబు అధ్యక్షతన పాలకమండలి సమావేశం నిర్వహించారు.
మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ వజ్జ బాబూరావు
పలాస, జూలై 31: జిరాయితీలో నిర్మించే భవనాలు తొలగించే అధికా రం ఎవరికీ లేదని, అభివృద్ధి పేరుతో పట్టణంలో మానవహక్కులు ఉల్లంఘించేలా కేటీరోడ్డు విస్తరణలో షాపులు, గృహాలు తొలగించారని టీడీపీ కౌన్సిలర్ వజ్జ బాబూరావు ఆరోపించారు. నిబంధనల మేరకు బాధితులందరికీ నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శనివారం పలాస-కాశీబుగ్గ మునిసి పల్ చైర్మన్ బళ్ల గిరిబాబు అధ్యక్షతన పాలకమండలి సమావేశం నిర్వహించారు. 23 వ వార్డు కౌన్సిలర్ బాబూరావు మాట్లాడుతూ.. కేటీ రోడ్డు విస్తరణ వాస్తవానికి మాస్టర్ ప్లాన్లో 66 అడుగులు ఉందని, అయితే గతంలో 80 అడుగులు విస్తరించాలని ప్రభుత్వం కోరగా తాము ప్రస్తుతం ఆ అవసరం లేదని ఆ ఫైల్ కదలనీయకుండా చేశామన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న జనాభా దృష్ట్యా 80 అడుగుల రోడ్డు అవసరమే అయినా నిబంధనల మేరకే చే యాల్సి ఉందన్నారు. కాని అందుకు విరుద్ధంగా ఎటువంటి హెచ్చరికలు లేకుండానే టీడీఆర్లు ఇస్తామని చెప్పి జిరాయితీ భూములు, భవనాలు పది అడుగుల మేర తొలగించి శ్మశాన వాతావరణాన్ని సృష్టించారని ఆరోపించారు. చైర్మన్ గిరిబాబు స్పందించి మాట్లాడుతూ.. ఆరు నెలల కిందట వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో వారంతా అంగీ కరించడంతోనే తొలగించామన్నారు. మునిసిపల్ నిబంధనల మేరకు పరిహారం ఇవ్వలేమని చెప్పారు. దీంతో బాబూరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం దీనిపై కలుగజేసుకొని పరిహారం ఇవ్వ వచ్చని, ఈ విషయమై ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు.
చెరువును డంపింగ్యార్డుగా మార్చడంతో ఇబ్బందులు
27వ వార్డు టీడీపీ కౌన్సిలర్ గురిటి సూర్యనారాయణ మాట్లాడుతూ.. తన వార్డులో చెరువును కప్పి డంపింగ్ యార్డుగా మార్చడంతో ప్రజలు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. వెంటనే ఈ చెరువును అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలని కోరారు. వజ్జ బాబూరావు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు చెరువులు కప్పడం నేర మని, అధికారులు బలవుతారని హెచ్చరించారు. వైస్చైర్మన్-2 మీసాల సురేష్ బాబు మాట్లాడుతూ.. అర్బన్ హెల్త్ సెంటర్లు మురికివాడలకు కేటాయిస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. 29వ వార్డు టీడీపీ కౌన్సిలర్ జోగ త్రివేణి మాట్లాడుతూ.. వార్డులో ప్రజ లు నిత్యం నీటికోసం ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పలువురు కౌన్సిలర్లు తాగునీరు, రోడ్లు తదితర సమస్యలను సమావేశం దృష్టికి తీసు కువచ్చారు. సమావేశంలో కమిషనర్ రాజగోపాలరావు, డీఈఈ ఎన్వీవీఎస్ నారాయణ, ఏఈ అవినాష్, వైస్చైర్మన్ బోర కృష్ణారావురెడ్డి తదితరులు పాల్గొన్నారు.