ఎకరానికి 50వేలు పరిహారం ఇవ్వాలి: రేవంత్
ABN , First Publish Date - 2022-01-22T07:48:03+05:30 IST
తామర తెగులు కారణంగా మిర్చి పంట దెబ్బతిని నష్టపోయిన
హైదరాబాద్, జనవరి 21(ఆంధ్రజ్యోతి): తామర తెగులు కారణంగా మిర్చి పంట దెబ్బతిని నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం కేసీఆర్ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ డిమాండ్ చేశారు. పంటకు ఈ తెగులు సోకి నష్టం జరగడంతో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున చెల్లిచాలన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానల కారణంగా వేలాది ఎకరాల్లో జరిగిన పంట నష్టానికిగాను ఎకరాకు రూ. 25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో తామర తెగులు సోకి వేలాది ఎకరాల్లో మిర్చి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.
ఖమ్మం సంక్షేమ విభాగం: తెగుళ్ల కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1.30లక్షల ఎకరాల్లో మిర్చి పంటకు నష్టం వాటిల్లిందని, ఆ రైతులకు ఎకరానికి రూ.లక్ష వంతున పరిహారం చెల్లించాలని వామపక్ష రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఖమ్మం ఉద్యాన శాఖ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి నాయకులు ధర్నా చేశారు.