పోలీసులను కుక్కలతో పోల్చిన హోం మంత్రిపై కేసు

ABN , First Publish Date - 2021-12-07T02:30:13+05:30 IST

పశువుల స్మగ్లింగ్‌ను నిరోధించడానికి బదులు కుక్కల్లా నిద్రపోతున్నారంటూ పోలీసులను..

పోలీసులను కుక్కలతో పోల్చిన హోం మంత్రిపై కేసు

బెంగళూరు: పశువుల స్మగ్లింగ్‌ను నిరోధించడానికి బదులు కుక్కల్లా నిద్రపోతున్నారంటూ పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్రపై కేసు నమోదైంది. రైతు సంఘాలైన రైత సంఘ, హసిరి సేనలు చిక్కమగళూరు జిల్లా కొప్పా పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదు చేశాయి. చిక్కమగళూరు ఎస్‌పీ హెచ్ఏ మచీంద్ర ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మంత్రి జ్ఞానేంద్రపై ఫిర్యాదు అందిందని, అయితే ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని చెప్పారు. హోం మంత్రి వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదుదారులు పేర్కొన్నట్టు తెలిపారు.


పశువుల దొంగతనాలు, స్మగ్లింగ్ నిరోధించడంలో పోలీసులు విఫలయమ్యారని, పశువుల స్మగ్లింగ్‌కు అలవాటుపడిన నేరగాళ్ల గురించి పోలీసులకు తెలిసినప్పటికీ లంచాలు తీసుకుంటూ కుక్కల్లా నిద్రపోతున్నారని జితేంద్ర ఓ అధికారిని ఫోనులో మందలిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. పోలీసులు సొంత గౌరవం పెంచుకోవాలని, ప్రభుత్వం వేతనాలు ఇస్తున్నప్పటికీ వాటితో బతకాలని అనుకోవడం లేదని, లంచాలకు అలవాటుపడిపోయారని ఆయన విమర్శించారు. చిక్కమగళూరు, శివమొగ్గ జిల్లాల్లో అప్రతిహతంగా పశువుల స్మగ్లింగ్ సాగుతోందన్నారు. కాగా, ఆ తర్వాత మంత్రి తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. తాను అందరు పోలీసులను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేయలేదని, కొందరికే అవి వర్తిస్తాయని అన్నారు.

Updated Date - 2021-12-07T02:30:13+05:30 IST