వైసీపీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-01-17T04:43:23+05:30 IST
వైసీపీకి వెన్నుదన్నుగా ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతోందని జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి మండలంలోని ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.
మూలగుంటపాడు ఎంపీటీసీ సభ్యుడు కుమారులపై దాడి నేపఽథ్యంలో మంత్రిని కలిసిన వైనం
సింగరాయకొండ, జనవరి 16 : వైసీపీకి వెన్నుదన్నుగా ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతోందని జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి మండలంలోని ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. మూలగుంటపాడు వైసీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడు అంబటి ప్రసాద్ కుమారులపై ఆ పార్టీలోని కీలక సామాజిక వర్గ నేతలు విచక్షణారహితంగా కొట్టిన నేపఽఽథ్యంలో శనివారం ఒంగోలులో మంత్రిని కలిశారు. పార్టీలో ఆద్యంతం తమకు ఎదురైన పరిణామాలను మంత్రికి వివరించారు. వైస్ ఎంపీపీ పదవిపై ప్రశ్నించినందుకే తన కుమారులపై రవికుమార్రెడ్డి తన అనుచరులైన రౌడీషీటర్ల చేత దారుణంగా కొట్టించారని ఎంపీటీసీ సభ్యుడు ప్రసాద్ మంత్రికి తెలిపారు. దాడి జరిగిన నేపథ్యంలో పలు పత్రికలు ప్రచురించిన కథనాలను చూపించారు. ఈ దుందుడుకు చర్యలతో మండలంలో పార్టీకి అండగా ఉన్న బీసీలు క్రమక్రమంగా దూరమవుతున్నారని వివరించారు. స్థానిక నేతలు చేస్తున్న ఆగడాలపై మంత్రి వద్ద ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా బాలినేని స్పందిస్తూ ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేయాలని సింగరాయకొండ సీఐ మర్రి లక్ష్మణ్కు ఫోన్ ద్వారా చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు యన్నాబత్తిన కార్తీక్యాదవ్, రాయి క్రాంతి, రాయి రమేష్, పిట్టా బ్రహ్మయ్య, కొల్లూరి సాయికోటి, అంబటి పవన్, మూలగుంటపాడు యువత పాల్గొన్నారు.