వ్యాక్సిన్ కొరతపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-05-11T05:25:46+05:30 IST
కర్నూలు జిల్లాలో వ్యాక్సిన్ సరఫరా, కొవిడ్ నిబంధనలు అమలులో కలెక్టర్, డీఎంహెచ్వోలు విఫలం చెందారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు సీనియర్ న్యాయవాది సి. నాగేంద్రనాథ్ సోమవారం ఈ-మెయిల్ ద్వారా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్కు ఫిర్యాదు చేశారు.
కర్నూలు(లీగల్), మే 10: కర్నూలు జిల్లాలో వ్యాక్సిన్ సరఫరా, కొవిడ్ నిబంధనలు అమలులో కలెక్టర్, డీఎంహెచ్వోలు విఫలం చెందారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు సీనియర్ న్యాయవాది సి. నాగేంద్రనాథ్ సోమవారం ఈ-మెయిల్ ద్వారా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్కు ఫిర్యాదు చేశారు. గత నెల 5వ తేదీన తాను, తన మిత్రుడితో కలిసి స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కొవాగ్జిన్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నామని, 28 రోజల విరామం తర్వాత ఈ నెల 5వ తేదీన రెండో డోసు తీసుకోవడానికి నగరంలోని వివిధ ఆరోగ్య కేంద్రాలకు తిరిగామని, ప్రతి చోట పెద్ద సంఖ్యలో వృద్ధులు, మహిళలు రెండో డోసు తీసుకోవడానికి మండుటెండల్లో గుమిగూడారని అన్నారు. అక్కడ అధికారులు కొవిడ్ నిబంధనలు ఏవీ అమలు చేయడం లేదని అన్నారు. దీంతో తాము భయాందోళనలకు గురై రెండో డోసు తీసుకోకుండానే వెనుదిరిగామని తెలిపారు. కొవిడ్ నిబంధనల అమలులో జిల్లా అధికారులు విఫలం చెందడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. కలెక్టర్, డీఎంహెచ్వోలపై మానవ హక్కుల ఉల్లంఘన, ఐపీసీలోని సెక్షన్ 166, విపత్తు నిర్వహణ చట్టాల కింద చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో సుప్రీం కోర్టును కోరారు. ఫిర్యాదు కాపీలను రాష్ట్ర హై కోర్టుకు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.వీ.రాధాకృష్ణ కృపాసాగర్కు కూడా పంపినట్లు ఆయన తెలిపారు.