కేసుల పరిష్కారానికి రాజీయే రాజమార్గం
ABN , First Publish Date - 2022-06-14T06:16:00+05:30 IST
కేసుల పరిష్కారానికి రాజీయే రాజమార్గమని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత అన్నారు.
- జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత
సిరిసిల్ల క్రైం, జూన్ 13: కేసుల పరిష్కారానికి రాజీయే రాజమార్గమని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత అన్నారు. సోమవారం జిల్లా కోర్టు సముదాయంలో జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా పోలీస్, ఎక్సైజ్ శాఖలు, జ్యుడీషియల్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 26న నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్లో దాదాపు 311 కేసులు పరిష్కారం లక్ష్యమన్నారు. జిల్లాలో 956 పెండింగ్ కేసులు ఉన్నాయన్నారు. వీటిలో పోలీస్స్టేషన్ల వారీగా పరిష్కరించడానికి సమన్వయంగా పని చేయాలన్నారు. రాజీ మార్గం ఉన్న క్రిమినల్, అన్ని సివిల్ కేసులకు లోక్ అదాలత్లో పరిష్కారం లభిస్తుందన్నారు. భూ తగాదాలు, బ్యాంకు రుణాలు, కుటుంబ కలహాలు తదితర కేసులలో లోక్ అదాలత్ సేవలు వినియోగించుకోవాలన్నారు. ఇరువర్గాల్లోని కక్షిదారుల్లో ఎవరికైనా ఆర్థిక స్థోమత లేకపోతే న్యాయసేవా సంస్థను సంప్రదిస్తే సేవలు అందిస్తుందన్నారు. ఒకసారి లోక్ అదాలత్లో కేసు పరిష్కారమైతే ఆ కేసులో ఏ కోర్టుకు వెళ్లే అవకాశం లేదన్నారు. ప్రతీ శనివారం నిర్వహించే లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. లోక్ అదాలత్ తీర్పు అంతిమం అన్నారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీలేఖ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సౌజన్య, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు చంద్రశేఖర్, నాగేంద్రచారి, సీఐలు అనిల్కుమార్, ఉపేందర్, వెంకటేశ్, లోక్ అదాలత్ సభ్యుడు చింతోజి భాస్కర్, ఎస్సైలు పాల్గొన్నారు.