కలెక్టరేట్ ఎదుట జీవీఎంసీ కాంట్రాక్టు కార్మికుల ఆందోళన
ABN , First Publish Date - 2022-01-20T04:54:19+05:30 IST
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, తమను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ కాంట్రాక్టు కార్మికులు బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు.
పనికి తగ్గ వేతనం, పర్మినెంట్ చేయాలంటూ డిమాండ్
విశాఖపట్నం, జనవరి 19: సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, తమను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ కాంట్రాక్టు కార్మికులు బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సీఐటీయూ నగర అధ్యక్షుడు ఆర్.కె.ఎస్.వి.కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జగన్ కార్మికులను ఆశల పల్లకిలో ఊరేగించారని, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి వ్యవహరించడం తగదన్నారు.
పారిశుధ్య కార్మికులు, కాంటాక్టు ఔట్సోర్సింగ్, కంప్యూటర్ డేటా ఆపరేటివ్ సిబ్బందికి పీఆర్సీ అమలు చేయాలన్నారు. ఆప్కాస్ సిబ్బంది వేతనాలు పెంచుతూ జారీచేసిన జీవోను తక్షణం సవరించాలని, జీవోఆర్టీ నంబరు 1615 ప్రకారం వేతనాలు, కరువు భత్యం, మధ్యంతర భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు జి.సుబ్బారావు, ఎం.వి.ప్రసాద్, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.