ఉక్కు పరిరక్షణకు ఆందోళనలు తీవ్రం
ABN , First Publish Date - 2021-10-25T06:08:03+05:30 IST
ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ మంత్రి రాజశేఖర్ డిమాండ్ చేశారు.
పోరాట కమిటీ చైర్మన్ మంత్రి రాజశేఖర్
కూర్మన్నపాలెం, అక్టోబరు 24: ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ మంత్రి రాజశేఖర్ డిమాండ్ చేశారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 255వ రోజు కొనసాగాయి. ఆదివారం ఈ దీక్షలలో పాల్గొన్న సింటర్ ప్లాంట్ కార్మికులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ బొగ్గు గనుల నిక్షేపాలను రానున్న నాలుగేళ్లలో విక్రయిస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను తప్పుబట్టారు. బొగ్గు కొరత కారణంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని వివరించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మరో చైర్మన్ డి.ఆదినారాయణ మాట్లాడుతూ కర్మాగారం కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులకు నేటికీ ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం అన్యాయమన్నారు. పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్యరామ్ మాట్లాడుతూ ఉద్యోగ భద్రత, సామాజిక న్యాయం ప్రభుత్వ రంగంలోనే ఉంటుందన్నారు. పోరాట కమిటీ నాయకుడు వరసాల శ్రీనివాసరావు, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.