గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించండి
ABN , First Publish Date - 2022-07-19T05:32:58+05:30 IST
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వైద్య సిబ్బందిని ఆదేశించారు.
గంగాధర, జూలై 18: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. సోమవారం గంగాధర పీహెచ్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిబ్బందితో మాట్లాడారు. వర్షాలకు గ్రామాల్లో నీరు నిల్వ ఉండి సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశమున్నందున ముందస్తుగా గ్రామాల్లో వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించాలని ఆదేశించారు. ఆయన వెంట సర్పంచ్ మేచినేనినవీన్రావు, డాక్టర్ సురేష్ సిబ్బంది పాల్గొన్నారు.
రామడుగు: ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజన్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. రామడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రం ముందు మురుగునీరు నిలిచి ఉండడం చూసి ఆయన వెంటనే తొలగించాలని, దోమల వ్యాప్తికి నివారించేందుకు మందులు పిచికారి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రలో అందుతున్న వైద్య సేవలను, మందుల నిలువ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.అనంతరం రామడుగు వాగు వంతెనను పరిశీలించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ జువైరియా, ఎంపీపీ కలిగేటి కవిత, ఉపాధ్యక్షుడు పూరెల్ల గోపాల్, సర్పంచ్ పంజాల ప్రమీల, తహసీల్దార్ రాజ్కుమార్, వైద్యాధికారి శిరీష పాల్గొన్నారు.