వైసీపీలో భగ్గుమన్న విభేదాలు
ABN , First Publish Date - 2020-05-23T10:43:06+05:30 IST
మండలంలోని నాయుడుపాలెం పంచాయతీలో అధికారపార్టీలో విభేదాలు రోడ్డునపడ్డాయి
నాయుడుపాలెం గ్రామంలో కుమ్ములాటలు
మద్దిశెట్టి, బూచేపల్లి వర్గీయుల బాహాబాహీ
లాఠీచార్జ్ చేసి చెదరగొట్టిన పోలీసులు
మూడు రోజుల్లో రెండుసార్లు గొడవపడ్డ వైనం
ముండ్లమూరు మే 22: మండలంలోని నాయుడుపాలెం పంచాయతీలో అధికారపార్టీలో విభేదాలు రోడ్డునపడ్డాయి. నిన్న మొన్నటి వరకు నివురు గప్పిన నిప్పులా ఉన్న గొడవలు కాస్త ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఆ పార్టీలో ని వారు వారంలోపే రెండుసార్లు ఘర్షణకు దిగారు. నాయుడుపాలెం పం చాయతీలో బంకా నాగిరెడ్డి, బద్రి వెంకటసుబ్బారెడ్డి వైసీపీలో నాయకులుగా కొనసాగుతున్నారు. ఎన్నికలప్పుడు వీరంతా కలిసి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ గెలుపునకు కృషి చేశారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో బంకా నాగిరెడ్డి బూచేపల్లి వర్గీయు డిగా కొనసాగుతున్నారు బద్రి ఎమ్మెల్యే వర్గీయులుగా కొన సాగుతున్నారు. గ్రామానికి సంబంధించి ఉపాధి పనుల కొత్త జాబ్కార్డుల నమోదు కోసం బంకా వర్గీయులు కొంత కాలం గా ఉపాధిహామీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
ఆ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ వారి వర్గీయులకు జాబ్కార్డులు నమో దు చేయకుండా ఆలస్యం చేస్తున్నాడని బుధవారం కార్యాల యం ఎదుటే గొడవకు దిగారు. మరలా అదే విషయమై శుక్రవారం మధ్యా హ్నం కూడా వైసీపీలోని రెండు వర్గాల వారు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఘర్షణ పడ్డారు. తోపులాట జరిగింది. దీంతో విషయం తెలుసుకున్న ఎస్సై రామకృష్ణ అక్కడకు వచ్చి గొడవపడుతున్న వారిపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. మొత్తంమీద అధికారపార్టీ వైసీపీలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గీయులుగా విడిపోయి బహిరంగంగా కొట్టుకోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.