సీఎం అభ్యర్థిపై పంజాబ్ కాంగ్రెస్‌ నేతల తలో మాట

ABN , First Publish Date - 2022-01-12T21:41:09+05:30 IST

ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించనప్పుడు పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది. కానీ 2017లో అభ్యర్థిని ప్రకటించి విజయం సాధించింది. ఈసారి కూడా అభ్యర్థిని ప్రకటిస్తారు. కాకపోతే ఆ అభ్యర్థి ఎవరని హైకమాండ్ నిర్ణయిస్తుంది..

సీఎం అభ్యర్థిపై పంజాబ్ కాంగ్రెస్‌ నేతల తలో మాట

చండీగఢ్: కొద్ది రోజుల్లో జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌కు రెండు ప్రముఖ ముఖాలు ఉన్నాయి. ఒకరు ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ కాగా, మరొకరు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఈ ఇద్దరు నేతలు తాజాగా వెల్లడించిన అంశాలను చూస్తుంటూ ఇప్పటి వరకు ఒక చర్చకు రానట్టే కనిపిస్తోంది. ఒకరు హైకమాండ్ నిర్ణయం అంటుంటే మరొకరు ప్రజలు నిర్ణయిస్తారని అంటున్నారు. మరొక నేత అయితే అసలు అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్తామని అంటున్నారు.


ముఖ్యమంత్రి అభ్యర్థిపై సీఎం చన్నీ స్పందిస్తూ ‘‘ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించనప్పుడు పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది. కానీ 2017లో అభ్యర్థిని ప్రకటించి విజయం సాధించింది. ఈసారి కూడా అభ్యర్థిని ప్రకటిస్తారు. కాకపోతే ఆ అభ్యర్థి ఎవరని హైకమాండ్ నిర్ణయిస్తుంది’’ అని అన్నారు. ఇదే విషయాన్ని సిద్ధూ వద్ద ప్రస్తావించగా ‘‘ప్రతి ఒక్కరు సీఎం కావాలనే అనుకుంటున్నారు. కానీ సీఎం ఎవరనేది ప్రజలు నిర్ణయిస్తారు. హైకమాండ్ సీఎంను నిర్ణయిస్తుందని మీకు ఎవరు చెప్పారు?’’ అని విలేకరులను ఎదురు ప్రశ్నించారు.


ఇక ఇదే అంశంపై సునిల్ జాఖర్ స్పందిస్తూ ‘‘ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించరు. జాయింట్ లీడర్‌షిప్‌లోనే పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది’’ అని సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రి అభ్యర్థిపై సీఎం చన్నీ ఒకలా పీసీసీ చీఫ్ సిద్ధమూ మరొకలా పార్టీ నేతలు ఇంకోలా స్పందిస్తున్నారు. దీంతో అసలు కాంగ్రెస్ పార్టీ తరపు సీఎం అభ్యర్థి ఎవరనేది పార్టీలోని నేతలే తేల్చుకోలేకపోతున్నారు.

Updated Date - 2022-01-12T21:41:09+05:30 IST